అమానుషం: మహిళ మృతి!, కరోనా అనుమానంతో జేసీబీలో స్మశానానికి
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారిని ఒంటరి చేస్తూ.. వారిని మరింతగా కుంగదీస్తున్నారు. దీంతో వారు మానసికంగా ఒత్తిడికి లోనై ఆ వ్యాధితోనే బలవుతున్నారు. ఇక కరోనాతో మృతి చెందినవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
కన్నవారు కూడా కరోనా మృతుల అంత్యక్రియాల్లో పాల్గొనడం లేదు. ఇలాంటి హృదయ విదారక ఘటనే తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు మండలం గోవిందపేట్లో చోటు చేసుకుంది. ఓ మహిళ కరోనాతో చనిపోయింది. ఆమె అంత్యక్రియలు జరిపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కన్నకొడుకు కూడా దూరంగానే ఉండిపోయాడు.

ఆమె మృతదేహాన్ని గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన జేసీబీ ముందు తొట్టెలో పడుకోబెట్టి వెళ్లిపోయాడు. ఇక చేసేదేం లేక జేసీబీ డ్రైవర్, కొందరు గ్రామస్తులు ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. కరోనా అనుమానంతో బంధువులు కూడా ఆమెను చూడటానికి రాకపోవడం గమనార్హం.
కాగా, సదరు మహిళ కొడుకుకు నాలుగు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో సోమవారం అతని కుటుంబసభ్యులకు కూడా టెస్టులు చేయగా.. వారికి కరోనా నెగిటివ్ వచ్చింది. పెరాలసిస్తో బాధపడుతున్న అతడి తల్లికి మంగళవారం కరోనా టెస్ట్ నిర్వహించాలనుకునేలోపే ఆమె మరణించారు. దీంతో ఆమె అంత్యక్రియలకు గ్రామ పెద్దలే ఏర్పాట్లు చేశారు. ఆమె కొడుకే ఆమె మృతదేహాన్ని జేసీబీలో పడకోబెట్టి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు.
మహబూబాబాద్ కలెక్టర్కు కరోనా
మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కాగా, మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియతో కలిసి పలు కార్యక్రమాల్లో కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు వారందరిలో కరోనా ఆందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications