నిజామాబాద్ జిల్లాలో వింత పక్షి.. కేశ్పల్లి శివకేశవ ఆలయానికి పోటెత్తిన భక్తులు
జక్రాన్ పల్లి : నిజామాబాద్ జిల్లాలో వింత చోటుచేసుకుంది. జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామంలోని శివకేశవ ఆలయానికి భక్తులు పోటెత్తారు. గుడ్లగూబను పోలిన పక్షి ఆలయంలో ప్రత్యక్షం కావడమే దీనికి కారణం. మంగళవారం ఉదయం పూజారి ఆలయ తలుపులు తెరవగానే ఈ పక్షి కనిపించింది.
ఆనోట ఈనోట ఈ విషయం వైరల్ గా మారడంతో చుట్టుపక్కల నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. అయితే ఇదంతా దేవుడి మహిమగా భావిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
వెంకటేశ్వరుడి చెంత చేరింది గరుడ పక్షి కాదట.. మరేంటో తెలుసా?
ఇటీవలే జగిత్యాల జిల్లాలోని కోరుట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి పక్షి ప్రత్యక్షమైంది. అది గరుడపక్షి అంటూ వైరల్ కావడంతో రాష్ట్రస్థాయిలో పెద్ద చర్చ జరిగింది.
వెంకన్న వాహనమైన గరుడ ఆయన సన్నిధికి చేరడం దైవ మహిమగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరకు అది గరుడపక్షి కాదని గుడ్లగూబ సంతతికి చెందిన "బర్న్ అవుల్" గా తేల్చారు.
తాజాగా కేశ్పల్లి గ్రామంలో కనిపించిన పక్షి కూడా "బర్న్ అవుల్" లాగే కనిపిస్తోంది. విషయం తెలియక వింత పక్షి అనుకుంటూ దాన్ని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.