టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర రాజమండ్రి జైలు నుంచి విడుదల
సంగం డెయిరీ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్కు బెయిల్ లభించింది. ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా బెయిల్ పై బయటికి వచ్చారు. గుంటూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆ డెయిరీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ధూళిపాళ్లపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు.
ఈ కేసులో సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. జైల్లో ఉండగానే వీరిద్దరూ కరోనా వైరస్ బారినపడ్డారు. వీరి బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది. షరతులపై బెయిల్ మంజూరు చేసింది. నరేంద్రతో పాటు గోపాల్కృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు విజయవాడ మునిసిపల్ పరిధిలోనే ఉండాలని కోర్టు షరతు విధించింది. నివాసం ఉంటున్న స్థలం చిరునామాను విచారణ అధికారికి ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు 24 గంటల ముందు విచారణ అధికారి నోటీసు ఇవ్వాలని సూచించింది.
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు నేపథ్యంలో నాలుగు వారాలుగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఆయన ఇన్ని రోజులు రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. అందులోనే ఆయనకు కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.