పట్టాభిరామ్ విడుదల: రాజమండ్రి జైలు నుంచి.. బెయిల్ ఇచ్చిన హై కోర్టు
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత పట్టాభిరామ్ విడుదల అయ్యారు. పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని పట్టాభిరామ్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో బెయిల్ కోరుతూ పట్టాభి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. కింది కోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు పట్టాభిరామ్ అరెస్టులో సరైన విధానాన్ని అమలు చేయలేదని తెలిపింది. రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని పేర్కొంది. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సెక్షన్ 41 ఏ నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని సూచించింది. 41 ఏ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు అమలు చేయలేదని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కొద్దిసేపటి కిందట విడుదలయ్యారు. అనంతరం తన వాహనంలో విజయవాడ పయనమయ్యారు. సీఎం జగన్ను పట్టాభిరామ్ బోసడీకే అని దూషించారంటూ విజయవాడ వ్యాపారి షేక్ మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పట్టాభి హైకోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకోగా, న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
పట్టాభి కామెంట్లతో ఏపీలో దుమారం చెలరేగింది. టీడీపీ శ్రేణుల ఆందోళనలు.. వైసీపీ కార్యకర్తల నిలువరింపులు జరిగాయి. చంద్రబాబు 36 గంటల దీక్ష కూడా చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను, రాష్ట్రపతిని కలువనున్నారు.