శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం: స్టేషన్లో అంబులెన్స్ను ఢీకొట్టిన ఏపీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లో పట్టాల మీదికి వచ్చిన ఓ అంబులెన్స్ను ఏపీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. రైలు వస్తోన్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన డ్రైవర్, ఇతర హెల్త్ వర్కర్లు అంబులెన్స్ నుంచి సకాలంలో బయటికి దూకారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

పలాస్ రైల్వే స్టేషన్లో..
జిల్లాలోని పలాస రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు బయలుదేరిన ఏపీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అది. సింహాచలం, విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి మీదుగా ఈ ఎక్స్ప్రెస్ పలాసకు చేరుకుంది. అక్కడి నుంచి సోంపేట, ఇచ్ఛాపురం, బరంపురం, ఖుర్దా రోడ్ జంక్షన్ మీదుగా భువనేశ్వర్ వెళ్లాల్సి ఉంది.

ఫలక్నుమా ప్రయాణికుడికి అస్వస్థత..
మార్గమధ్యలో పలాస స్టేషన్కు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి పశ్చిమ బెంగాల్లోని హౌరాకు బయలుదేరిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి అత్యవసర వైద్య చికిత్సను అందించాల్సి వచ్చింది. దీనితో అతణ్ని పలాస స్టేషన్లో కిందికి దించారు. అంబులెన్స్ను పిలిపించారు. ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించడానికి స్టేషన్ అధికారులు అంబులెన్స్ను పిలిపించారు.

పట్టాల మీదికి అంబులెన్స్..
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ను పలాస స్టేషన్కు చేరుకుంది. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడు నడవలేని స్థితిలో ఉండటం వల్ల అంబులెన్స్ను నేరుగా స్టేషన్లో పట్టాల మీదికి తీసుకెళ్లారు. ప్లాట్ఫామ్ మీది నుంచి అతణ్ని అంబులెన్స్కి షిఫ్ట్ చేస్తోన్న సమయంలో ఏపీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ స్టేషన్లోకి దూసుకొచ్చింది. అంబులెన్స్ను ఢీ కొట్టింది. రైలు ఢీ కొట్టిన వేగానికి అంబులెన్స్ నుజ్జునుజ్జయింది. వెనుకభాగం మొత్తం ధ్వంసమైంది.
అంబులెన్స్ను లాక్కెళ్లిన ఇంటర్సిటీ..
ప్లాట్ఫామ్ వద్ద పట్టాలపై అంబులెన్స్ను గమనించిన ఏపీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించాడు. కొంతదూరం నుంచే బ్రేక్ను అప్లై చేశాడు. అయినప్పటికీ- రైలు వేగం కొంతవరకు తగ్గిందే తప్ప పూర్తిగా అదుపులోకి రాలేదు. అంబులెన్స్ను ఢీ కొట్టిన ఈ ఎక్స్ప్రెస్.. కొన్ని మీటర్లు దాన్ని అలాగే లాక్కెళ్లింది. దీనితో కొంతమేర ప్లాట్ఫామ్, పట్టాలు దెబ్బతిన్నాయి. అంబులెన్స్ వెనుక వైపు చక్రాలు ఊడిపోయాయి.

తప్పిన ప్రాణనష్టం..
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వస్తోందనే విషయాన్ని గమనించిన వెంటనే డ్రైవర్, ఇతర హెల్త్ వర్కర్లు అంబులెన్స్ నుంచి కిందికి దూకారు. రైలు అంబులెన్స్ను పట్టాల మీది నుంచి పక్కకు తీసుకెళ్లే వీలు కలగలేదు. అంత సమయం కూడా దక్కలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం సంభవించలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే భద్రతా సిబ్బందితో సమన్వయం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications