ఆటో, టీప్పర్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా మండలం దేగాం వద్ద శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, టిప్పర్ ఢీకొని 15 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు.
బాధితులు నిజామాబాద్ జిల్లా నవీపేట నుంచి సారంగాపూర్ మండలం అడెల్లి జాతరకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో టిప్పర్ కిందికి పూర్తిగా దూసుకుపోయింది. మృతదేహాలను భైంసా ఆసుపత్రికి తరలించారు. 15 మంది మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు.
మృతులు మహారాష్ట్రలోని బోకర్ మండలం బల్లాడ్ గ్రామానికి చెందినవారు. కూలి పనుల కోసం వచ్చి కొన్నాళ్లుగా నిజామాబాద్ జిల్లా నవీపేటలో నివాసం ఉంటున్నారు. ప్రమాదంలో బాసరకు చెందిన ఆటో డ్రైవర్ కూడా మృతి చెందారు.
మృతులను గణపత్, బాజేకర్, కాంతాబాయి, సుశీలబాయి, నందనాబాయి, శ్యామలాబాయి, నర్సింగ్, మహానంద, దీప, సాయిప్రశాంత్, సౌవ్రుక, రాజేశ్, అర్జున్, ప్రేమ్, అర్చనలుగా గుర్తించారు. సారంగపూర్ మండలం అడెల్లి పోచమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు మహారాష్ట్ర బల్లాడ్ గ్రామానికి చెందిన 18 మంది ఇటుక కార్మికులు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.