మైనర్ బాలికతో పెళ్లి, చిత్రహింసలు: కాపురం చేయట్లేదని లీగల్ నోటీసులు!
మైనర్ బాలిక(16)కు ఆమె కంటే పెద్ద వయస్సున్న వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేయడమే గాకుండా, అతనితో కాపురం చేయకుండా తిరిగి వచ్చేసిందని.. ఆమెకు లీగల్ నోటీసులు పంపారు.
హైదరాబాద్: మైనర్ బాలిక(16)కు ఆమె కంటే పెద్ద వయస్సున్న వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేయడమే గాకుండా, అతనితో కాపురం చేయకుండా తిరిగి వచ్చేసిందని.. ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. కాగా, బాల్య వివాహం దానంతట అదే చట్ట విరుద్ధం కాదని, అందువల్ల ఫిర్యాదు ఇస్తే తప్ప తాము చర్యలు తీసుకునే అవకాశం లేదని పోలీసులు చెప్పారు. దీంతో ఆ బాలిక.. బాలల హక్కుల కార్యకర్తలను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోనే జరగడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. గత సంవత్సరం ఫిబ్రవరిలో సదరు బాలిక పదో తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధం అవుతుండగా, ఆమెకు బలవంతంగా ఆమె కంటే దాదాపు 20ఏళ్లు పెద్దవాడైన బంధువుకు ఇచ్చి పెళ్లి చేశారు. అత్త చనిపోతోందని, తన కొడుకు పెళ్లి చూడాలనుకుంటోందని.. అందుకే పెళ్లికి ఒప్పుకోవాలని చెప్పి ఆమెను ఒప్పించారు.

దీంతో అప్పుడు పెళ్ళి హడావుడిగా జరిగిపోయిందని, వరుడికి 35ఏళ్ల వయస్సున్న విషయం అప్పట్లో తనకు తెలియదని బాధిత బాలిక తెలిపింది. పెళ్లి తర్వాత కూడా తనను చదువుకోనివ్వాలని అప్పట్లో తాను కోరినట్లు తెలిపింది. కాగా, పరీక్షల తర్వాత ఆమెను అత్తారింటికి పంపారు.
అయితే, అత్తింట్లో ఆమెను ప్రతీరోజూ శారీరకంగా, లైంగికంగా హింసించడం మొదలుపెట్టారు. పెళ్లైన రెండు నెలల తర్వాత ఆ చిత్ర హింసలు భరించలేక ఆమె తిరిగి ఇంటికి వచ్చేసింది. దీంతో కట్నంగా ఇచ్చిన లక్ష రూపాయలు, నగలు తిరిగి ఇచ్చేయాలని అత్తింటివారిని అడగ్గా, వారు సదరు బాలికకు లీగల్ నోటీసులు పంపారు.
అంతేగాక, అమ్మాయి తల్లిదండ్రులకు ఆ డబ్బులు ఇవ్వడం కంటే.. లాయర్లకే ఆ డబ్బు ఇస్తామని సదరు బాలిక భర్త చెబుతుండటం గమనార్హం. దీంతో ఆమె భర్త తరపున వాదించే న్యాయవాదిపై తాము క్రిమినల్ కేసు పెడతామని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు స్పష్టం చేశారు.
ప్రస్తుతం జూనియర్ కాలేజీకి వెళ్లి చదువుకుంటున్న ఆ అమ్మాయి.. ఇక తిరిగి భర్త వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. తాను చదువుకుని తన కాళ్ల మీద నిలబడతానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. కాగా, ఏడాదిలోగా కోర్టును ఆశ్రయించి సదరు బాలిక తన వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications