అమెరికా కష్టాలు, మరో 22 మంది వెనక్కి: బేడీలు వేశారు, హైదరాబాద్లోను చేదు
హైదరాబాద్: అమెరికాకు వెళ్తున్న మరికొందరు తెలుగు విద్యార్థులకు షాక్ తగిలింది. తాజాగా న్యూయార్క్ వెళ్లిన మరో ఇరవై రెండు మందిని తిప్పి పంపించారు. ఈ నెల 7వ తేదీన అమెరికా వెళ్లిన వారిని న్యూయార్క్ విమానాశ్రయంలో అధికారులు ఇబ్బందులకు గురి చేసి, ఆ తర్వాత తిప్పి పంపించారు.
సమాచారం మేరకు... న్యూయార్క్ చేరుకున్నాక అధికారులు... విద్యార్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత గుంపులుగా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. చాలామందిని వెనక్కి పంపిస్తున్నప్పటికీ మళ్లీ ఎందుకు వస్తున్నారని నిలదీశారు. చదువుకునేందుకు ఇక్కడిదాకా ఎందుకని ప్రశ్నించారు.
అంతేకాదు.. తమకు బేడీలు వేసి విమానాశ్రయంలో తిప్పారని, వెంటనే వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని విద్యార్థులు వాపోయారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, న్యూయార్క్ నుంచి వచ్చిన విద్యార్థులు శనివారం రాత్రి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.
శంషాబాద్ చేరుకున్న తమను టికెట్ డబ్బులు చెల్లించాలని ఎయిర్ ఇండియా సిబ్బంది అక్కడే కూర్చోబెట్టారని విద్యార్థులు ఆరోపించారు. అర్ధరాత్రి వరకు అలాగే కూర్చోబెట్టారు. అదే సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ విమానాశ్రయం నుంచి బయటకి వస్తుండడంతో అక్కడే నిరీక్షిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను అడ్డుకుని విషయం చెప్పారు.
పలువురు తల్లిదండ్రులు కంటతడి పెట్టడంతో అలీ ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడి విద్యార్థులను వదిలిపెట్టేలా చర్యలు తీసుకున్నారు. తెలుగు విద్యార్థుల ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమెరికా దృష్టికి తీసుకెళ్లిందని అలీ చెప్పారు.