ఆ పత్రికలకు పనేం ఉండదు, ఇలాంటివే రాస్తాయి!: మూడో పెళ్లిపై అజారుద్దీన్
హైదరాబాద్: తాను మూడో పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తల పైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ గురువారం నాడు మరోసారి స్పందించారు. అదంతా అబద్దమని, తాను పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న పత్రికలు ఇలాంటి వార్తలే రాస్తుంటాయని, వారికి మరో పని ఉండదని ఎద్దేవా చేశారు.
కనీసం పెద్ద పత్రికలు ఇలాంటి వార్త రాసే ముందు వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుందని, తనను సంప్రదిస్తే బాగుండేదన్నారు. ఈరోజు తనకు జరిగింది రేపు మరొకరికి జరగవచ్చు కదా అన్నారు. మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.
మీడియా అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. వ్యక్తిగత వార్తలు రాసేటపుడు బాధ్యాతాయుతంగా వ్యవహరించి సంబంధిత వ్యక్తుల నుంచి స్పష్టత తీసుకుంటే బాగుంటుందని సూచించారు. కాగా, ఈ రోజు ముస్లీంలు మిలాదున్ నబీ పర్వదినం జరుపుకుంటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అజారుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మట్లాడారు. ఇదిలా ఉండగా, అజారుద్దీన్ తన మొదటి భార్యకు తలాఖ్ చెప్పిన తర్వాత సినీ నటి సంగీత బిజ్లానీని వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత సంగీతకు కూడా విడాకులిచ్చాడు. అనంతరం ఓ అమెరికన్ మోడల్ను వివాహం చేసుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. ఇంతకుముందు అతను ట్విట్టర్లోను ఈ వార్తలను ఖండించారు.
ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
మిలాదున్ నబీ సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో అయుత మహా చండీయాగంలో బిజీబిజీగా ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లంతా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.