నల్గొండలో విషాదం: బోరుబావిలో పడిన 4 ఏళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: 4ఏళ్ల చిన్నారి 40 అడుగుల బోరుబావిలో పడి మరణించిన సంఘటన నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం పులిచర్ల గ్రామంలో జరిగింది. బాలగొని నర్సింహ, సరిత దంపతులు. వీరి కుమారుడు శివ(4)ను ఆదివారం సెలవు కావడంతో పొలానికి తీసుకెళ్లారు.
తల్లిదండ్రులు వ్వవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి పంట నీటి కోసం రెండు రోజుల క్రితం బాలగోని వెంకటేశ్వర్లు పొలంలో బోరు వేశాడు. నీరు పడకపోవడంతో కేసింగ్లు తీసేసి వదిలేశారు. ఈ క్రమంలో బాలుడి పెదనాన్న వెంకటేశ్వర్లు కూతుళ్లు సింధు, శిరీషలు, బోరు వేసిన తర్వాత వచ్చిన మట్టిని తీసుకెళ్లేందుకు వచ్చారు.
వాళ్లతో పాటే శివ కూడా అక్కడకు వెళ్లాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. పొలం పనుల అనంతరం శివ కోసం తల్లిదండ్రులు వెతికినా ఎక్కడా కనిపించలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి బోరులో చూడడంతో దానిపై కప్పిన గొనె సంచి ద్వారా అందులోకి పడిపోడవాన్ని గమనించారు.
శివ బోరులోనే పడ్డాడని నిశ్చయించుకున్న తర్వాత ఓ తాడును అందులోకి వదిలారు. అరగంట పాటు ఆ తాడును పట్టుకున్న శివ ఆ తర్వాత లోపలికి పడిపోయాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయాన్ని స్ధానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన దేవరకొండ డీఎస్పీ యంజీ చంద్ర, హాలియా సీఐ పార్థసారధి, డీటీ లక్ష్మణ్ బాబు, పైర్సిబ్బంది, వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి శివను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అదే సమయంలో వేరే పనులు చేస్తున్న నాలుగు ఎక్స్కవేటర్ల సాయంతో బోరు బావిని తవ్వి సాయంత్రం 6.30 గంటలకు బాలుడిని బయటకు తీశారు.
చికిత్స కోసం బాలుడిని సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ చిన్నారి మరణించినట్లు వైద్యులు ధుృవీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.