రమ్యలా ప్రమాదం: 'సంజన పరిస్థితి 24 గంటలు గడిస్తేనే', ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు పైన వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి గాయపడిన అయిదేళ్ల సంజన పరిస్థితి క్రిటికల్గానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. సంజన కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆదివారం రాత్రి తల్లి శ్రీదేవి, సంజనలు బస్సు కోసం నిరీక్షిస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంజన బ్రెయిన్ డెడ్ అయింది. ఆమె వెంటిలేషన్ పైన ఉంది. కుడికాలు, కుడిచేయి విరిగాయి. తల్లి శ్రీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీదేవి పక్కటెముకలు విరిగాయి.
ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. డ్రైవర్ వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కారులోనే ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని శ్రీనివాస్, యాదిరెడ్డిలుగా గుర్తించారు. దీంతో అరెస్టైన వారి సంఖ్య మూడుకు పెరిగింది.
రమ్య తరహా మరో ప్రమాదం: ఔటర్లో ఢీకొట్టిన కారు, అమ్మాయి బ్రెయిన్ డెడ్
కాగా, హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఆదివారం తప్పతాగి అతివేగంగా కారు నడిపిన ముగ్గురు యువకులు రోడ్డు పైన ఉన్న తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనలో తల్లీకుమార్తెలకు గాయాలయ్యాయి. కూతురు పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఇరువురు వేర్వేరు ఆసుపత్రుల్లో ఉన్నారు.
సికింద్రాబాద్ లాలాపేట్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని ప్రశాంత్నగర్లో శివానంద్ నివసిస్తుంటాడు. ఇతని భార్య శ్రీదేవి కుమార్తెలు ప్రవల్లిక (9), సంజన(5)లను తీసుకుని ఆదివారం రాత్రి పెద్ద అంబర్పేట నగర పంచాయతీ పసుమాముల గ్రామం కళానగర్లోని పుట్టింటికి బయలుదేరింది.
రాత్రి 9.45 గంటల సమయంలో పెద్దఅంబర్పేటలో సంఘీనగర్ వెళ్లే వైపు బస్సు దిగి రోడ్డు దాటేందుకు వేచి ఉండగా చౌటుప్పల్ వైపు నుంచి నగరంలోకి వస్తున్న కారు (ఏపీ 29ఎన్ 5799) వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో తల్లీకూతుళ్లు అమాంతం ఎగిరిపడ్డారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీదేవి, సంజనలను స్థానికులు హయత్నగర్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రవల్లిక గాయాలు లేకుండా బయటపడింది. అపస్మారక స్థితిలో ఉన్న సంజన పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు.
కారులోని ముగ్గురు యువకులు మద్యం తాగి ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు పరారయ్యారని, ఒకరిని పట్టుకున్న స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత అతను కూడా పారిపోయాడు. కారులోని మంచినీటి సీసాలో మద్యం కలిపి ఉంది. డ్యాష్ బోర్డు మీద గ్లాసులు, తినుబండారాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా కారు నిజాంపేట విజయపురికాలనీకి చెందిన సునీతదిగా గుర్తించారు.