వినాయక చవితి వేళ: జనగాంలో బయటపడిన 800 ఏళ్లనాటి అతిపెద్ద మూషిక శిల్పం
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాం గ్రామంలో 800 ఏళ్లనాటి శిథిల శివాలయం వద్ద అరుదైన మూషిక శిల్పం బయటపడింది. ఈ గ్రామ శివారులో కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా.. బుధవారం ఈ మూషిక శిల్పం వెలుగుచూసింది. వినాయక చవితికి మూడు రోజుల ముందు ఈ శిల్పం బయటపడటంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఈ మూషిక శిల్ప వివరాలను వెల్లడించారు. ఎర్ర ఇసుకరాతితో చెక్కిన ఈ శిల్పం 3 అడుగుల పొడువు, రెండున్నర అండుగుల ఎత్తు ఉందని తెలిపారు. త్రిలింగాలయ అర్చకుడు రమేష్ శర్మ, రామోజు హరగోపాల్, సముద్రాల సునీల్ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందంతో కలిసి మూషిక వాహనాన్ని పరిశీలించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు.

సర్వాభరణాలతో ఆలంకరించినట్లున్న ఈ శిల్పం గణపతిదేవుని కాలానికి చెందిందని ఆయన చెప్పారు. త్రికూటాలయం రెండు ఆలయాల్లో శివలింగాలున్నాయని, మూడో ఆలయం వినాయకుడిదై ఉంటుందని తెలిపారు. గుప్త నిధుల కోసం దుండగులు ఈ విగ్రహాన్ిన పెకిలించివేసి ఉంటారన్నారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని, దీన్ని భద్రపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శివనాగిరెడ్డి.
మొదలైన వినాయక చవితి సందడి
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల సందడి మొదలైంది. ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల సందర్శనకు సిద్ధమయ్యాడు. రెండు నెలలపాటు నిరంతరం శ్రమించిన శిల్పులు వినాయక చవితికి ఐదు రోజుల ముందే పూర్తి చేశారు. ఇంతముందుగా విగ్రహాన్ని పూర్తి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ క్రమంలో సోమవారం నుంచే భక్తులు ఖైరతాబాద్లో వెలసిన పంచముఖ రుద్ర మహాగణపతిని దర్శించుకుంటున్నారు. కాగా, ఇక్కడ ఒక్క అడుగు వినాయకుడితో విగ్రహ ఏర్పాటు ప్రారంభమైంది. గత రెండేళ్ల క్రితం 65ఏళ్లు నిండిన సందర్భంగా 65 అడుగుల మహా గణపతిని ఏర్పాటు చేశారు. ఇక గత సంవత్సరం కరోనావైరస్ కారణంగా 11 అడుగులకే పరిమితం చేశారు.
ఈ ఏడాది మాత్రం40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువుతో వినాయకుడు కొలువుదీరాడు. మమాగణపతి నవరాత్రులు 10వ తేదీతో ప్రారంభమవుతాయి. కాగా, సోమవారం వినాయకుడి వద్ద హోమం నిర్వహించారు. నిమజ్జనం సెప్టెంబర్ 19న అనంత చతుర్ధశి రోజున ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ట్యాంక్బండ్ హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తామని ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు.
ట్యాంక్బండ్పై నుంచి హుస్సేన్సాగర్ జలాల్లోకి క్రేన్ ద్వారా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే తీరును సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ట్యాంక్బండ్పై రెండు క్రేన్లను ఏర్పాటు చేసి పాత విగ్రహాలను ప్రయోగాత్మకంగా నిమజ్జనం చేయించారు.
అనంతరం సీపీ అంజనీ కుమర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10న గణేష్ చతుర్థి ప్రారంభమవుతుందని, మూడో రోజు నుంచి నిమజ్జనాలు జరుగుతాయన్నారు. 19న వేలాది విగ్రహాలు సామూహిక నిమజ్జనాలుంటాయన్నారు. ప్రమాదాలకు తావు లేకుండా, సమయం ఆదా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల చేపట్టిన ట్యాంక్ బండ్ సుందరీకరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా చేస్తే బాగుంటుందనే విషయాన్ని పరిశీలించామని సీపీ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. తాజాగా, హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు పలు ఆంక్షలను విధించింది. సుదూర ప్రాంతాల నుంచి విగ్రహాలను ట్యాంక్బండ్కు రాకుండా చూడాలని సూచించింది.












Click it and Unblock the Notifications