రైతు జల సంకల్పం!: రావిగూడెం నుంచి రాజధాని దాకా పాదయాత్ర
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రావిగూడెం వాసి షకీల్ అహ్మద్ తన స్వగ్రామం నుంచి రాజధాని వరకు పాదయాత్ర చేపట్టారు.
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రావిగూడెం వాసి షకీల్ అహ్మద్ 20ఎకరాల పంట భూమున్న రైతు. నియోజకవర్గం మీదుగా మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు ప్రవహిస్తున్నా.. చెరువులు, కుంటలు నిండిన దాఖలాలు లేవు. చుక్కనీరు పారక ఎస్సారెస్పీ కాలువలు శిథిలావస్థకు చేరాయి.
ఫలితంగానే ఆ ప్రాంతంలో కరువు వచ్చి పొలాలు బీళ్లుగా మారుతున్న పరిస్థితులు అతన్ని కదిలించాయి. ఆ ప్రాంత సాగునీటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంకల్పించిన ఆయన.. స్వగ్రామం నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం దానికి శ్రీకారం చుట్టారు. '240 కిలోమీటర్ల పాదయాత్ర ఆరు రోజుల్లో పూర్తిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలుస్తానని, మార్గమధ్యలో జిల్లా పాలనాధికారులకు విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తానని షకీల్ పేర్కొన్నారు. దీనికి గ్రామస్తులు మద్దతు పలికారు. డప్పు వాయిద్యాలతో పొలిమేరల వరకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు.