మేన బావ వేధింపులు: వరుడికి అశ్లీల ఫొటోలు, నిశ్చితార్థానికి ముందే యువతి బలవన్మరణం
వరంగల్: తనను కాకుండా మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంటోందనే కారణంగా ఓ యువతికి ఆమె మేన బావ నుంచి తీవ్ర వేధింపులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుకున్నాయి. ఈ విషాద ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ..
వివరాల్లోకి వెళితే.. వరంగల్ నగరంలోని గిర్మాజీపేట బొడ్రాయి ప్రాంతానికి చెందిన దొడ్డ మాధవి, సుధాకర్ దంపతులు స్థానికంగా కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. వీరికి మౌనిక, వెంకటేశ్ అనే కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు మౌనిక ఎంబీఏ పూర్తిచేసిన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. కొడుకు హైదరాబాద్లోనే ఎంటెక్ చదువుతున్నాడు.
తననే వివాహం చేసుకోవాలంటూ
మౌనికకు ఇటీవల సింగపూర్కు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. నిశ్చితార్ధం పెట్టుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కారుడ్రైవర్గా పనిచేస్తున్న మేనబావ సంతోష్ తననే పెళ్లి చేసుకోవాలని, మరొకరిని చేసుకోవద్దని మౌనికను వేధించడం ప్రారంభించాడు. ఆమెతో కలిసి గతంలో దిగిన చిత్రాలను మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలను సింగపూర్లో ఉంటున్న కాబోయే వరుడికి పంపించి వివాహం కాకుండా అడ్డుపడుతన్నాడు.
వేధింపులతో..
ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు వరంగల్లోని ఇంతేజార్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫిబ్రవరి 6న సంతోష్పై కేసు నమోదుచేసి, ఫిబ్రవరి 12న రిమాండుపై జైలుకు పంపించారు. నిశ్చితార్థానికి సమయం దగ్గర పడడంతో ఆమె రెండు రోజుల క్రితం వరంగల్ వచ్చింది.
పేర్లు బావ వేధింపులు తప్పవని..
కాగా, ఇటీవలే జైలు నుంచి విడుదలైన సంతోష్ తన నిశ్చితార్థానికి అడ్డంకులు సృష్టిస్తాడనే అనుమానంతో మౌనిక ముందుగానే రాసుకున్న లేఖను తన వద్ద ఉంచుకొని శనివారం తెల్లవారుజామున ఇంట్లోని కిటికీ ఇనుప చువ్వలకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యకు మేనబావ పట్టూరి సంతోష్, మేనమామ వీరేశం, మేనత్త సరోజనలే కారణమని మౌనిక తన ఆత్మహత్య లేఖలో పేర్కొనడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.