మద్యం సేవిస్తూ మంచింగ్.. అంతలోనే వ్యక్తి ప్రాణం తీసిన ఆమ్లెట్!
నల్గొండ: ఆమ్లెట్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మద్యం తాగుతున్న వ్యక్తి గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుపోవడంతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో గురువారం చోటు చేసుకుంది. మద్యం తాగుతూ ఆమ్లెట్ తింటుండగా.. గొంతులో ఇరుక్కుపోయి అతడు చనిపోయాడు.
జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్ రెడ్డి(38) స్థానిక మద్యం దుకాణంలోని పర్మిట్ రూంలో కూర్చుని మద్యం తాగుతున్నాడు. మందులో మంచింగ్ కోసమని ఓ ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడు. దీంతో వేడి వేడి ఆమ్లెట్ అతని టేబుల్ పైకి వచ్చేసింది.
ఇక ఓ పెగ్గేసిన అతడు ఆలస్యం ఎందుకని.. వేడి వేడి ఆమ్లెట్ను గొంతులో వేసుకున్నాడు. అంతే అది గొంతులో ఇరుక్కుపోయి అతడి ప్రాణాలు తీసింది. ఊపిరాడక అక్కడికక్కడే అతడు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడున్న వారంతా షాక్కి గురయ్యారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే, మద్యం ఎక్కువై ప్రాణాలు పోయినవారిని చూశాం కానీ.. ఇలా ఆమ్లెట్ కూడా ప్రాణం తీస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. అందుకే మద్యం సేవించేప్పుడు ఆహారం తీసుకోవడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.