ఇది కథ కాదు: భర్త, కొడుకు మరణంతో తల్లీకూతురు ఆత్మహత్య, 11ఏళ్లలో లోకం వీడిన ఫ్యామిలీ
వరంగల్: కుటుంబానికి అండగా ఉన్న భర్త అనారోగ్యంతో మృతి చెందినా.. తన కొడుకు, కూతురు ఉన్నారన్న ధైర్యంతో ఆమె తన జీవితాన్ని కొనసాగించింది. అయితే, కుమారుడు కూడా నాలుగు నెలల క్రితం చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తల్లీకూతుళ్లు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది.

భర్త తర్వాత కొడుకు..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బొక్కలగడ్డకు చెందిన మనుగొండ సరిత(40) హన్మకొండలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. పదేళ్ల కిందట భర్త పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యానికి గురై మృతి చెందారు. కారుణ్య నియామకాల కింద భర్త ఉద్యోగం సరితకు రావడంతో రెవెన్యూ విభాగంలో ఆర్ఐగా విధులు నిర్వరిస్తున్నారు. కూతురు మధుమిత(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు నెలల క్రితం ఆమె కుమారుడు రోహిత్(21) హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

మనోవేదనతో కుంగిపోయిన తల్లీకూతుళ్లు..
కట్టుకున్న భర్త, కన్న కొడుకు మరణంతో సరిత తీవ్ర మానసిక వేదనకు గురైంది. రోహిత్ మరణించిన తర్వాత ఉద్యోగానికి వెళ్లడం లేదు. బంధువులు, తోటి ఉద్యోగులు ధైర్యం చెప్పడంతో కొంతకాలంగా విధులకు హాజరవుతోంది. ఉద్యోగం చేస్తూ సుబేదారి ప్రాంతంలో నివాసం ఉంటోంది. గురువారం దేశాయిపేటలో బంధువుల పెళ్లి ఉండటంతో సరిత తల్లిదండ్రులు వెళ్లారు. సరితను పెళ్లికి రమ్మని ఎంత బ్రతిమిలాడినా వెళ్లలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తీసేందుకు బయటి నుంచి సరితను పిలిచారు. లోపల గడియ పెట్టి ఉండి.. ఎంత పిలిచినా సరిత, మధుమిత పలుకలేదు. దీంతో బలవంతంగా తలుపులను తెరిచి చూడగా సరిత, మధుమిత ఇంటి దూలానికి వేలాడుతూ ఉరివేసుకుని కనిపించారని ఎస్సై వివరించారు. దూలానికి వేలాడుతున్న వారిని చూసి తల్లిదండ్రులు, అన్నావదినలు కన్నీరుమున్నీరుగా విలపించారు. 11 ఏళ్లలో కుటుంబంలో అందరూ చనిపోయారంటూ సరిత, మధుమితల మృతదేహాలను చూసి బంధువులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.

కొడుకులా కావొద్దని 100 హెల్మెట్లు పంచారు
కాగా, సరిత కుమారుడు రోహిత్కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడని బంధువులు తెలిపారు. తన కొడుకులా మరెవరికీ అలాంటి పరిస్థితి రావొద్దని.. సరిత.. రోహిత్ స్నేహితులు, బంధువులకు 100 మందికిపైగా హెల్మెట్లు కొనిచ్చింది.. ఈ సారి రాఖీ పండుగకు తన బంధువుల్లో ద్విచక్రవాహనాలు ఉన్న వారందరికీ హెల్మెట్లు కొనివ్వడానికి కూడా ఏర్పా ట్లు చేసిందని వారు చెప్పారు.

కలెక్టర్, అధికారుల నివాళి..
భర్త, కుమారుడి మరణంతో మనస్తాపం చెంది ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మనుగొండ సరిత, కూతురు మధుమిత మృత దేహాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట, జేసీ దయానంద్, హన్మకొండ తహసీల్దార్ ఖాజామోయినోద్దిన్లు సందర్శించి నివాళులర్పించారు. గురువారం రాత్రి కావడంతో మృత దేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు.












Click it and Unblock the Notifications