రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లు, ఇతర ఆస్తుల అమ్మకంపై ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనుంది.
ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.
కాగా, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండేలా ఇళ్లను నిర్మించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా ఈ కార్పొరేషన్ ద్వారా మొదలుపెట్టిన ప్లాట్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.

ఉమ్మడి ఏపీలో రాజీవ్ స్వగృహ కింద 36 ప్రాజెక్టులు చేపట్టారు. తెలంగాణలోని భూములను తనఖాపెట్టి బ్యాంకుల నుంచి రూ.1,000 కోట్ల అప్పు తీసుకున్నారని.. అందులో ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకుండా ప్రభుత్వంపై భారం మోపినట్లు ఆరోపణలున్నాయి. మూడేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ అప్పుతోపాటు రూ.1,200 కోట్ల వడ్డీని బ్యాంకులకు చెల్లించి తనఖాలో ఉన్న 784 ఎకరాల భూములను విడిపించింది. ఇప్పుడు ఆ భూములను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ ప్లాట్లను యథాతథంగా విక్రయించి కొంత నిధులను సేకరించడంతోపాటు కార్పొరేషన్పై ఉన్న ఆర్థిక భారాన్ని తొలగించేందుకు రాజీవ్ స్వగృహ ఆస్తులను విక్రయించేందుకు ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications