వచ్చాక పెళ్లి.. అంతలోనే మోసపోయానంటూ..: గల్ఫ్లో యువకుడి ఆత్మహత్య
జగిత్యాల: తనను కంపెనీ మోసం చేసిందంటూ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీతం సరిగా ఇవ్వడం లేదని, తాను ఇంటికి డబ్బులు పంపించలేకపోతున్నాని అతడు చనిపోయే ముందు తీసుకున్న వాయిస్ మెజేస్లో పేర్కొన్నాడు.
బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లికి చెందిన తోట శంకరయ్య, కళావతికి ఇద్దరు కుమారులు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో కొన్నేళ్ల కిందట ఆ కుటుంబం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లకు వలస వచ్చింది.
దోహాలో పనికి కుదిరాడు కానీ..
ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండటంతో అప్పు చేసి నాగరాజు(24)ను ఐదేళ్ల్ల కిందట దోహా ఖతర్కి పంపించారు. ఆయన అక్కడ వాహనాలను శుభ్రం చేసే కంపెనీలో పనికి కుదిరాడు. కొంతకాలంగా వేతనం తక్కువగా ఇవ్వడమే కాకుండా అందులో మరింత కోత విధించారు.
మెసేజ్ పంపి..
ఈ క్రమంలో రెండు నెలలుగా ఆయన ఇంటికి వేతనం పంపించలేదు. దీంతో మనోవేదనకు గురైన నాగరాజు బుధవారం రాత్రి స్నేహితులకు వాట్సప్ వాయిస్ మెసేజ్ పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మళ్లీ జన్మంటూ ఉంటే..
‘హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు.. అందరూ ఎట్లున్నరు.. కంపెనోళ్ల కారణంగా నేను మోసపోయా.. జీతం డబ్బులు తక్కువ ఇచ్చిండ్రు. మొన్నటి నెలలో అమ్మకు నా జీతం పంపించలే. వచ్చే నెల పంపిస్తానని చెప్పా. జీతం పోయిన నెలకంటే ఈ నెల తక్కువగా వచ్చింది. అవి కూడా చేతికి ఇవ్వలేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే చనిపోవాలనుకుంటున్నా. అందరూ మంచిగా ఉండండి. ఇది నా ఆఖరు మెసేజ్, మళ్లీ జన్మంటూ ఉంటే మిమ్మల్ని కలుస్తా. రాజు, మహేశ్, రాజేశ్, విజ్జీ బై బై నా గురించి ఏమనుకోకండి. ఇక ఉంటా' అంటూ స్నేహితులకు నాగరాజు తన వాయిస్ మెసేజ్లో పేర్కొన్నాడు.
వచ్చాక పెళ్లి చేసుకుంటా..
ఇది ఇలావుంటే.. అంతకుముందు నాగరాజు నెల రోజుల్లో ఇంటికి వచ్చి పెంబట్లలో ఇల్లు నిర్మించుకొని, పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు ఓ అమ్మాయిని వివాహానికి నిశ్చయించారు. ఈ క్రమంలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక నాయకులు, అధికారులు స్పందించి మృతదేహాన్ని వెంటనే గ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.