ఘరానా దొంగ అరెస్టు: 150 కేసులు (ఫొటో)
హైదరాబాద్: ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సికింద్రాబాదులోని మల్కాగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద రూ.8 లక్షల విలువ చేసే 26.3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని రాజేశ్వరిపేటకు చెందిన శీలంశెట్టి వెంకటరమణ పేరుగాంచిన దొంగ.
ఇతని తండ్రి నాగేశ్వరరావు రైల్వే స్ర్కాప్ను దొంగిలించడంలో పేరుగాంచాడు. పలుమార్లు మార్లు జైలుకి వెళ్లాడు. 1993లో మృతి చెందాడు. తండ్రి నుంచి చోరవృత్తిని అందిపుచ్చుకున్న వెంకటరమణ 30 ఏళ్లగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతనిపై విజయవాడ పట్టణంతో పాటు గుడివాడ, మచిలీపట్నం పోలీస్స్టేషన్లలో పలు కేసులున్నాయి. 2005లో నగరంలోని బేగంపేటకు మొదటి భార్య షకీలతో వలస వచ్చాడు.

పగలు తాళం వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట దొంగతనాలు చేసేవాడు. ఇతనిపై చైతన్యపురి, ఎల్బీనగర్, సరూర్నగర్, మీర్పేట, వనస్థలిపురం, నాచారం, కుషాయిగూడ, ఉప్పల్, ఘట్కేసర్లో 150కి పైగా కేసులున్నాయి. ఈ కేసుల్లో చర్లపల్లి, రాజమండ్రి, విజయవాడ, వరంగల్ జైళ్లకు వెళ్లి వచ్చాడు. సరూర్నగర్ పోలీసులు ఏప్రిల్ రెండో తేదీన వెంకటరమణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మే 27న చర్లపల్లి జైలు నుంచి బెయిల్పై విడుదలై మేడిపల్లి, మల్కాజిగిరి, నాచారం, ఉప్పల్, ఘట్కేసర్, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లలో ఎనిమిది ఇళ్లలో దొంగతనం చేశాడు.
దొంగ సొత్తును అమ్మగా వచ్చిన డబ్బుతో మహబూబ్నగర్, కర్నూల్కు వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అతని భార్య షకీల కూడా ఇళ్లలో దొంగతనాలు చేసేది. ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టి వరంగల్ జిల్లా జనగామకు చెందిన పద్మను వివాహం చేసుకున్నాడు.
మొదటి భార్య ద్వారా ముగ్గురు పిల్లలు, రెండో భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతనికి ఇళ్లలో దొంగతనాలు చేసే సుంకరి ప్రసాద్, శ్రీనివాసరెడ్డితో స్నేహం ఉంది. దొంగిలించిన సొత్తును నగరంలో అమ్మే ప్రయత్నం చేస్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వెంకటరమణను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications