అబిడ్స్లో హోటల్పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
అబిడ్స్ ప్యాలెస్ హోటల్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. హోటల్ భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ ప్యాలెస్ హోటల్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. హోటల్ భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న మహిళను అలంక్రిత(32)గా పోలీసులు గుర్తించారు. మహిళ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. నార్సింగి రాయల్ ఫంక్షన్హాల్ సమీపంలో చోటు చేసుకుందీ ఘటన. నార్సింగి ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకి హకీంపేటకు చెందిన ఒసామా(18) విద్యార్థి.
ఇతను తమ మెడికల్ షాపులో పనిచేసే మహ్మద్ షాహబాజ్(18), మహ్మద్ ఇర్ఫాన్(22)లతో కలిసి శుక్రవారం ఉదయం గండిపేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఐ20 కారు అతివేగంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా మెహిదీపట్నం నుంచి గండిపేట వైపు వస్తున్న ఎంజీఐటీ బస్సును ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారును ఒసామా నడిపిస్తున్నాడు. డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న షాహబాజ్ తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందగా, వెనక సీటులో కూర్చున్న మహ్మద్ ఇర్ఫాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఒసామా కాళ్లు విరిగి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఎంజీఐటీ బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి.