ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’: ల్యాప్టాప్లో సూసైడ్నోట్
అతని వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు.
హైదరాబాద్: అతని వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలున్నాయి.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన జానకీరాజ్ కుమారుడు నిఖిల్ రాజ్(25) ఎంబీఏ చదువుకుని ఓ కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అంబర్పేట బతుకమ్మకుంట శాంతినగర్లో స్నేహితుడు అజయ్ కుమార్తో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కాగా, సోమవారం నాడు తన సూసైడ్ నోట్ ల్యాప్టాప్లో ఉందని, తన కోసం వెతకొద్దంటూ ఓ కాగితంపై రాసి, దాన్ని ల్యాప్టాప్ వద్ద పెట్టి వెళ్లిపోయాడు నిఖిల్.
నిద్రలేచిన స్నేహితుడు అజయ్ ఉదయం 10గంటల సమయంలో నిఖిల్రాజ్ ఎక్కడికి వెళ్లాడోనని ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. అదే సమయంలో ల్యాప్టాప్ వద్ద సూసైడ్ నోట్ కాగితం కనబడగానే ఆందోళన చెందిన అజయ్.. పోలీసులకు సమాచారం అందజేశాడు. గదికి వచ్చిన పోలీసులు ల్యాప్టాప్ తెరిచి చూడగా సూసైడ్ నోట్ కనిపించింది.
అందులో 'తమ్ముడూ పవన్ నాకు బతకాలని ఆశ లేదు. జీవితం మీద ఆసక్తి పోయింది. అమ్మానాన్నను బాగా చూసుకో. సారీ మమ్మీ, డాడీ' అని పేర్కొన్నాడు నిఖిల్. అంతేగాక, తాను స్థాపించబోయే కంపెనీ ప్రాజెక్ట్ వివరాలు డీ డ్రైవ్లో ఉన్నాయని పేర్కొన్నాడు. తన అకౌంట్లో డబ్బులు ఉన్నాయని వాటిని బదిలీ చేసుకోమని తెలిపాడు.
తన ఆశయాన్ని కొననసాగించేలా కంపెనీని స్థాపించి గ్రామీణ ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని నిఖిల్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిఖిల్ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. నల్లకుంట ప్రాంతంలోని ఓ ఏటీఎంలో భారీగా నగదు డ్రా చేసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.