కెసిఆర్ పర్యటన: ఎబిఎన్ చానెల్ ప్రతినిధి అరెస్టు
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ప్రతినిధి రంగనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదంగా మారింది. తనను గృహనిర్బంధం చేయడం మీడియా గొంతు నొక్కడమేనని అన్నారు. తన అరెస్ట్తో ఏబీఎన్ ఛానల్ నిషేధం వెనుక ప్రభుత్వం పాత్ర లేదని కెసిఆర్ ఇంతకాలం చెబుతూ వస్తున్నది పచ్చి అబద్దమనేది తేలిపోయిందని ఆయన అన్నారు.
‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' వరంగల్ జిల్లా ఇన్చార్జి మిద్దెల రంగనాథ్ను ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు అరెస్టు చేశారు. నగరంలోని ఎల్లంబజార్లోని రంగనాథ్ ఇంటికి ఎస్సై నాగబాబుతోపాటు అర్ధరాత్రి ముగ్గురు పోలీసులు వచ్చారు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. మొదటి అంతస్తులో ఉన్న రంగనాథ్ను అరెస్టు చేస్తున్నట్లు చెప్పి ఆయనను మట్టెవాడ పోలీసు స్టేషన్కు తరలించారు. తనను ఎందుకు తీసుకెళుతున్నారని రంగనాథ్ ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు.
గత అర్దరాత్రి మట్టెవాడ పోలీసులు తమ ఇంటికి వచ్చి కెసిఆరక్ జిల్లా పర్యటన సందర్భంగా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పారన్నారు. తన వద్ద నుంచి ఫోన్ కూడా లాక్కున్నారని, ఎవరితో మాట్లాడవద్దని పోలీసులు ఆంక్షలు విధించారని రంగనాథ్ తెలిపారు. తనతో పాటు పలు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేసేందుకు వారు ప్రయత్నం చేశారన్నారు. తన అరెస్ట్పై జర్నలిస్టులు సంఘాలు, పలు ప్రజా సంఘాల ఆందోళనలతో విడుదల చేశారని, అయితే అనేక ఆంక్షలు విధించి తనను విడుదల చేసినట్లు తెలిపారు. కేసీఆర్ పర్యటనను కవర్ చేయవద్దని, ఇంట్లోని ఉండాలని మట్టెవాడ సీఐ ఆంక్షలు విధించినట్లు రంగనాథ్ వెల్లడించారు.
కాగా, వరంగల్ ఏబీఎన్ ప్రతినిధి రంగనాథ్ అక్రమ అరెస్ట్ను రాజకీయ పార్టీలు, ప్రజా, జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ ప్రతినిధి రంగనాథ్ అరెస్ట్ ఖండిస్తున్నామని ఐజేయూ నేత దేవులపల్లి అమర్ అన్నారు. తక్షణం సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరైనా నిరసన తెలపవచ్చని అమర్ అన్నారు.
ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రంగనాథ్ అరెస్ట్ను ఖండిస్తున్నామన్న ఆయన ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. తెలంగాణలో మీడియాది కీలక పాత్ర అని పౌర సంఘాల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదని, ఇది మంచి సంప్రదాయం కాదని సూచించారు. ఏబీఎన్ ప్రతినిధి రంగానాథ్ అరెస్ట్ను ఖండిస్తున్నామని, ప్రభుత్వం ఓవరాక్షన్ చేస్తోందని పీవోడబ్ల్యూ నేత సంధ్య వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ఏబీఎన్ ప్రతినిధి రంగనాథ్ అరెస్టే నిదర్శనమని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వరంగల్ ఏబీఎన్ ప్రతినిధి అరెస్ట్ను ఖండిస్తున్నామని ఆయన అన్నారు.