అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆక్రోశం!.. రణరంగాన్ని తలపిస్తున్న ఇంటర్ బోర్డు కార్యాలయం!
Recommended Video
హైదరాబాద్ : తప్పుడుతడకల ఫలితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డును ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

బాధ్యులపై చర్యలకు డిమాండ్
ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ పిలుపు మేరకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ నినాదాలతో ఇంటర్ బోర్డు కార్యాలయ ఆవరణ మారుమోగింది. అవకతవకలకు కారణమైన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఫలితాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజీనామాకు పట్టుబట్టారు. ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగా విద్యార్థులు నష్టపోయినందున రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫీజు రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఆందోళనకారుల అరెస్ట్
నిరసనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆందోళనలో పాల్గొనని విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు
మరోవైపు తమ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిన ఇంటర్ బోర్డు అధికారులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలతో మారుమోగుతున్న కార్యాలయం రణరంగాన్ని తలపిస్తుండటంతో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరేషాన్ అవుతున్నారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఎవరిని కలవాలో తెలియక, కనీసం ఆఫీసు లోపలికి అడుగుపెట్టే అవకాశం లేక ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications