తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ టికెట్ల ధరలు పెంపు: తెలంగాణలో 6 షోలకు అనుమతి
హైదరాబాద్: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న 'ఆది పురుష్'(Adipurush) చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు గుడ్న్యూస్ చెప్పాయి. అగ్ర కథానాయకుల సినిమాలు విడుదలైనప్పుడు నిబంధనల మేరకు మొదటివారం టికెట్ ధరలను పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం 'ఆదిపురుష్' టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై రూ. 50 పెంచింది. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ పెంపునకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక, రోజుకు ఆరు షోలకూ అనుమతి ఇచ్చింది.

తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రస్తుతం టికెట్ ధర రూ. 175 ఉండగా.. దీనికి అదనంగా రూ. 50 చెల్లించాలి. 3డీ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో గ్లాస్లకు అదనపు ధర చెల్లించాలి. అలాగే మల్టీప్లెక్స్లో రూ. 295 తోపాటు 3డీ గ్లాస్ల ఛార్జీ వసూలు చేయనున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరపై రూ. 50 పెంచినట్లు సమాచారం. దీనిపై అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ఇప్పటికే ఉత్తర భారతదేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా.. తెలుగు రాష్ట్రాల్లో రేపు అంటే బుధవారం ఉదయం నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది.
ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రీలిజ్ ఫంక్షన్ తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించారు. ఇక ఈ చిత్ర ప్రదర్శనలో ప్రతి షోకి హనుమంతుడికి ఒక సీటు కేటాయించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై నిర్మాతలు ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా కోసం సినీఅభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications