సికింద్రాబాద్ స్టేషన్ లో రణరంగం - పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి - ఫైనల్ వార్నింగ్..!!
సికింద్రాబాద్ స్టేషన్ లో నిరసన కారులకు పోలీసులు తుది హెచ్చరిక జారీ చేసారు. ఉదయం నుంచి సాగుతున్న విధ్వంసం ఇప్పుడు కొంత మేర అదుపులోకి వచ్చింది. నిరసనకారులు విధ్వసానికి దిగటంతో పాటుగా రైళ్ల దహనం.. రాళ్ల దాడులు.. ప్రయాణీకులకు గాయాలు కావటంతో వారిని నియంత్రించేందుకు ఆర్పీఎఫ్ కాల్పులకు దిగింది. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 8 మందికి గాయాలు అయ్యాయి. వారికి గాంధీ అస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అగ్నిపథ్ పథకం కు నిరసనగా వందల సంఖ్యలో నిరసనకారులు సికింద్రాబాద్లో యువకులు చేపట్టిన ఆందోళన దారి తప్పింది.
యధేచ్చగా విధ్వంసం
స్టేషన్ లోకి ప్రవేశించి యధేచ్చగా విధ్వంసాలకు దిగారు. రైళ్లకు నిప్పు పెట్టారు. స్టాళ్లను తగుల ధ్వంసం చేసారు. రైల్వే ఆస్తులకు భారీగా నష్టం చేసారు. దీంతో..పోలీసులు కాల్పులకు దిగారు. అందులో వరంగల్ కు చెందిన దామోదర్ అనే యువకుడు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లటంతో ఆయన మరణించాడు. ఆందోళనకారులు పోలీసులు, రైళ్లపై రాళ్లతో దాడి చేయడం వల్ల సికింద్రాబాద్ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ప్రయాణీకులు ఆందోళనతో బయటకు పరుగులు తీసారు. రైళ్లను ఎక్కడికక్కడ నిలుపుదల చేసారు. ఇంకా స్టేషన్ లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరసనకారులకు హెచ్చరిక చేసారు.
పోలీసుల ఫైనల్ వార్నింగ్
వెంటనే స్టేషన్ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. మాట వినకుంటే మరోసారి ఫైరింగ్ తప్పదని హెచ్చరించారు. 71 రైళ్లను రద్దు చేసారు. అనేక రైళ్లను దారి మళ్లించారు. దీంతో.. ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. స్టేషన్ లో జరిగిన విధ్వంసం.. పోలీసుల పైన రాళ్ల దాడితో ముందుగా స్టేషన్ ను ఖాళీ చేయించిన తరువాత రైళ్ల రాకపోకలపైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అక్కడ ఉన్న వారందరినీ మూకుమ్మడిగా అరెస్ట్ చేయటమా.. లేక, వారితో చర్చలు జరిపే అంశం పైన చర్చిస్తున్నారు. కానీ, ఆందోళన కారులు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ప్రాణనష్టం లేకుండా వారిని బయటకు పంపే విధంగా ఆలోచన జరుగుతోంది.
పోలీసుల కాల్పులు -ఒకరు మృతి
ఇదే సమయంలో.. సికింద్రాబాద్ అల్లర్లతో అప్రమత్తమైన రాష్ట్రంలోని నాంపల్లి, వరంగల్, మహబూబాబాద్, కాజీపేట, జనగామ, డోర్నకల్, రైల్వేస్టేషన్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లలో రైల్వే పోలీసులతో పాటు సాధారణ పోలీసులు కూడా మోహరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రయాణీకుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ..పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా నియంత్రణలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.