మిమ్మల్ని పరుగెత్తించడానికి ఒక్క కనుసైగ చాలు..: పోలీసులపై అక్బరుద్దీన్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది.

ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఖిల భారత మజ్లిస్-ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడమే దీనికి కారణం.
చంద్రాయన్ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ. ఇది ఆయనకు కంచుకోట. 1999 నుంచి వరుసగా ఈ స్థానం నుంచి భారీ మెజారీటీతో గెలుస్తూ వస్తోన్నారు. ఈ సారి కూడా ఆయనే గెలుస్తారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
మంగళవారం రాత్రి చంద్రాయన్ గుట్ట నియోజకవర్గం పరిధిలోని లలితబాగ్లో అక్బరుద్దీన్.. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం.. రాత్రి 10 గంటల తరువాత ప్రచార కార్యక్రమాలను నిర్వహించకూడదు. ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది.
10 గంటల సమయంలోనూ అక్బరుద్దీన్ ప్రసంగిస్తోండటంతో స్థానిక పోలీసులు ఆయనన అడ్డుకునే ప్రయత్నించారు. దీనితో అక్బర్ ఆగ్రహంతో ఊగిపోయారు. స్టేజీపై నుంచి వారిపైకి దూసుకెళ్లారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాల తరువాత భయపడ్డానని, బలహీనపడ్డానని అనుకున్నారా? అంటూ నిప్పులు చెరిగారు.

గడువు ముగియడానికి ఇంకా అయిదు నిమిషాల సమయం ఉందని, అప్పటివరకూ ఎవరూ తనను అడ్డుకోలేరని అక్బర్ అన్నారు. ఈ అయిదు తాను ప్రసంగించి తీరుతానని స్పష్టం చేశారు. ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిని ఇక్కడి నుంచి పరుగెత్తిస్తామని హెచ్చరించారు.
ఒక్క సైగ చేస్తే చాలు.. తన అనుచరులు, పార్టీ అభిమానులు ఇక్కడి నుంచి పరుగెత్తిస్తారని పోలీసులను బెదిరించారు. పరుగెత్తించమంటారా? అని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్బరుద్దీన్ ఒవైసీ తీరుపై భారతీయ జనతా పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు.












Click it and Unblock the Notifications