నవ్వుతారేం... మీడియా ఉంది, మీవాళ్లకి సలహాలివ్వు: అక్బర్-కెటిఆర్ వాగ్వాదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో మంగళవారం నాడు రైతు సమస్యల పైన చర్చ సందర్భంగా... మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ముఖ్యమంత్రి జిల్లాలోనే ఎక్కువ రైతుల ఆత్మహత్య
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయన్నారు. మెదక్ జిల్లాలో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. రైతులకు కిసాన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. లక్షలమంది దరఖాస్తు చేసుకుంటే 8వేల మందికి మాత్రమే కిసాన్ కార్డులు ఇచ్చారన్నారు.
మంత్రులు, అధికారులు హైదరాబాదులో ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు. నెపాన్ని ప్రభుత్వం పూర్తిగా వరుణుడిపై నెట్టేస్తోందన్నారు. మంత్రులు క్షేత్రస్థాయికి ఎందుకు వెళ్లడం లేదన్నారు.

మాట్లాడుతుంటే నవ్వుతున్నారు...
అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూంటే.. ఇక్కడ మనుషులు నవ్వుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదేపదే చెబుతున్నారని, కానీ కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదన్నారు. గణాంకాల ప్రకారం రోజుకో రైతు చనిపోతున్నాడన్నారు. విపక్ష నేతలు మాట్లాడుతుంటే నవ్వులాటగా తీసుకుంటున్నారన్నారు.
సీదాగా మాట్లాడాలి: కెటిఆర్, ఏం సీదాగా లేదు: అక్బర్
అక్బరుద్దీన్ ఓవైసీ ఏ విషయాన్నైనా సూటిగా మాట్లాడాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దానికి అక్బర్ స్పందిస్తూ... నేను సీదాగా ఏం మాట్లాడలేదో చెప్పాలన్నారు. దానికి కెటిఆర్ స్పందిస్తూ... మేం ఏదో నవ్వుతున్నామని, మీడియా చూస్తోందని చెబుతున్నారని, ఇదేమిటన్నారు.
అధికార పార్టీ పట్ల హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. అధికార పార్టీ సభ్యులకి సీరియస్ లేదని చెప్పడం ఏం పద్ధతి అన్నారు. రైతుల ఆత్మహత్యల పైన ప్రభుత్వం సీరియస్గా ఉందని చెబుతున్నామని కెటిఆర్ అన్నారు.
ప్రతిపక్షాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వాన్ని తప్పుపట్టడంలో అర్థం లేదన్నారు. దానికి అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కెటిఆర్ చదువుకున్న వ్యక్తి అని, అమెరికాలో చదువుకొని వచ్చారని వ్యాఖ్యానించారు. కెటిఆర్ తన సలహాలు టిఆర్ఎస్ సభ్యులకు చెప్పుకుంటే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications