ఫలక్నుమా ప్యాలెస్లో భోజనం ఖరీదు రూ.18 వేలు: ఈ హోటల్ అద్భతాలు ఎన్నో
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్కు రాష్ట్ర ప్రభుత్వం ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఇస్తోంది. ఈ ప్యాలెస్ ఓ అద్భుతం. దీని గురించి తెలుసుకుంటే ఎవరైనా సూపర్ అనాల్సిందే.
ప్రపంచ 'ప్రత్యేక' విందుకు 'ఫలక్నుమా' రెడీ: మోడీ, ఇవాంకా, దిగ్గజాల రాక
ఫలక్నుమా ప్యాలెస్లోని ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ హాల్గా పేర్కొంటున్న ప్యాలెస్లోని '101 డైనింగ్ హాల్'లో ఈ విందు ఇస్తున్నారు. హాల్లో 108 అడుగల పొడవైన టేబుల్ ఉంది. ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం చేయవచ్చ. చెక్కతో చేసిన కళాకృతులు, స్పటిక కొవ్వొత్తులు, వినసొంపైన సంగీతం ఈ హాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఎవరైనా తినవచ్చు, కానీ డబ్బు వెదజల్లాలి
మోడీ, ఇవాంకాల కోసం ఫలక్నుమా ప్యాలెస్ ఎంపిక చేశారు. అయితే ఈ హోటల్లో వీవీఐపీలకే భోజనం పెడతారని అనుకోవద్దు. ఇందులో ఎవరైనా తినవచ్చు. నచ్చిన పదార్థాలు, ఎంత కావాలంటే అంత తినవచ్చు. కానీ షరతు. ఈ టేబుల్ పైన భోజనానికి తక్కువలో తక్కువ 40 మంది ఉండాలి. ఒక్కరు ఒక్కపూట ప్రత్యేక టేబుల్ వద్ద భోజనం చేయాలంటే మాత్రం రూ.18 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక రోజు ఉండాలంటే రూ.46వేలు చెల్లించాలి.
అక్కడ మైక్ సెట్ లేకున్నా మాటలు వినిపిస్తాయి
101 డైనింగ్ టేబుల్ వద్ద అటు వైపు 50 మంది, ఇటువైపు 50 మంది కూర్చోవచ్చు. మధ్యలో కుర్చీ ఉంటుంది. అది ప్రత్యేక అతిథి కోసం. ప్రధాన అతిథి కూర్చునే టేబుల్ వద్ద మైక్ సెట్ లేకపోయినా.. వారు మాట్లాడితే అందరికీ వినిపిస్తాయి. ఇది ఇంజినీరింగ్ నైపుణ్యం.
ప్రత్యేక కలపతో తయారు చేశారు
80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తులో ఉండే ఈ టేబుల్ పైభాగాన్ని తయారు చేయడానికి ఏడు పొడవైన కలప దుంగలను వినియోగించారు. అందుకు టేకు, రోజ్ ఉడ్లను వాడారు. చుట్టూ కుర్చీలకు పచ్చ రంగులో ఉండే అరుదైన లెదర్ని ఉపయోగించారు.
1893లో డైనింగ్ టేబుల్ పూర్తి చేశారు
డైనింగ్ హాలు ఉంటే గదిలో అయిదు షాండ్లీయర్లు ఉంటాయి. గోడలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ టేబుల్ను నిజాం ప్రధానిగా పని చేసిన నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా 1893లో దీనిని పూర్తి చేశారు. ఇందుకోసం ఫ్రాన్స్ నుంచి నిపుణులు వచ్చారు. అప్పుడు నవాబుల భోజన ఏర్పాట్ల కోసం 25 మందిని ప్రత్యేకంగా నియమించుకున్నారు.
2010లో అద్దెకు తీసుకున్న టాటా హోటల్స్
ఇక్కడ పాత్రలు అన్నీ బంగారంతో తయారు చేసినవిగా ఉండేవని చెబుతారు. అలాగే గోడలపై ఆహార పదార్థాల ఛిత్రాలు చూసి తాము మెచ్చిన దానిని తయారు చేయించుకునే వారని చెబుతారు. 2010లో ఈ హోటల్ను నిజాం వారసుల నుంచి తాజ్ హోటల్స్ గ్రూప్ అద్దెకు తీసుకుంది. అప్పటి నుంచి అది తాజ్ ఫలక్నుమా హోటల్గా మారింది.
సచిన్ నుంచి ఇవాంకా దాకా
గతంలో ఈ హోటల్లో ఎందరో వంటలు రుచి చూశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ నటి కరీనా కపూర్ తదితరులు రుచి చూశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, వైట్ హౌస్ అడ్వయిజర్ ఇవాంకా ట్రంప్ ఈ హోటల్లో భోజనం రుచి చూస్తున్నారు.
ఫలక్నుమా ప్యాలెస్ ఇదీ, రూపశిల్పి
ఫలక్ నుమా ప్యాలెస్ చార్మినార్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని విస్తీర్ణం 32 ఎకరాలు. భవన విస్తీర్ణం లక్షా పదకొండు వేల ఐదు వందల చదరపు అడుగులు. విలియం వార్డ్ మారెట్ దీని రూపశిల్పి. ప్యాలెస్సలో 60 గదులు, 22 హాళ్లు ఉన్నాయి. నిర్మాణానికి అప్పట్లో రూ.40 లక్షలు ఖర్చయింది. ఇందుకు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ రుణం ఇచ్చింది.
ఫైవ్ స్టార్గా మార్చిన తాజ్ గ్రూప్
ఈ ప్యాలెస్కు 1884 మార్చి 3న పునాదిరాయి వేశారు. 1893లో పూర్తయింది. ఏడో నిజాం దీనిని రాయల్ గెస్ట్ హౌస్గా వినియోగించుకున్నారు. తాజ్ గ్రూప్ దీనిని తన తీసుకొని ఐదు నక్షత్రాల హోటల్గా మార్చింది. ఇవాంకా, మోడీలకు ఇక్కడ విందు ఇస్తున్న నేపథ్యంలో మరోసారి ఫలక్నుమా ప్యాలెస్ చర్చనీయాంశంగా మారింది.