ఓటుకు నోటులా... ఫోన్ సంభాషణ కలకలం!: ఎంపీటీసీ భర్తకు ఎమ్మెల్యే భారీ ఆఫర్?
హైదరాబాద్/ఖమ్మం: కొద్ది నెలల క్రితం ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. వీడియోలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీకి డబ్బులు ఇవ్వజూపుతున్నట్లు ఉంది. ఇది కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, దాదాపు అలాంటిదే మరొకటి వెలుగు చూసిందని వార్తలు వస్తున్నాయి.
త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్కు ఓ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను సదరు ఎమ్మెల్యే ఖండించారని కూడా చెబుతున్నారు.
కొణిజెర్ల 2 ఎంపీటీసీ సభ్యురాలి భర్తకు... ఓ ఎమ్మెల్యే మధ్య జరిగిందని భావిస్తున్న ఫోన్ సంభాషణ కలకలం సృష్టిస్తోందని, ఆ ఎంపీటీసీని తమ పార్టీలోకి రప్పించేందుకు లేదా తమ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పదేపదే ఫోన్ చేశారట.
అయితే, సదరు ఎంపీటీసీ భర్త మాత్రం ఏదో సాకుతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, దీంతో ఆయన పైన ఎమ్మెల్యే అసహనం ప్రకటించినట్లుగా తెలుస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, ఎంపీటీసీ, ఎమ్మెల్యేల మధ్య నాలుగు దఫాలుగా ఫోన్ సంభాషణలు జరిగినట్లుగా తెలుస్తోందంటున్నారు.