'మంథని' మరవకముందే: మరో దళిత యువకునిపై హత్యాయత్నం.. జాగృతి కన్వీనర్పై ఆరోపణలు
మహాశక్తి ఆలయం నుంచి జీవన్ ను కిడ్నాప్ చేసి.. అటుపై రేకుర్తి శివారు వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు యత్నించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కరీంనగర్: రాష్ట్రంలో వరుసగా దళితుల మీద దాడులు జరుగుతుండటం కలవరపెడుతోంది. దళిత సంఘాలన్ని ఐక్యమై నిలదీస్తే తప్ప ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన అంశం. దాడుల విషయాల్లో పార్టీ ప్రస్తావన తీసుకురావద్దని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొనడం మరింత విచారం.
మొన్నటి మంథని ఘటన, నిన్నటి కరీంనగర్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నది ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నేతలేనన్న ఆరోపణలను మంత్రి విస్మరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మంథని ఘటన రేకెత్తించిన సంచలనం మరువకముందే మరో దళిత యువకుడిపై తీవ్రమైన దాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొనేలా చేసింది.

కరీంనగర్ దాడి విషయాన్ని పరిశీలిస్తే.. కిసాన్ నగర్ కు చెందిన దళిత యువకుడు తోటపల్లి జీవన్ను ప్రేమ వ్యవహారం కారణంగా తెలంగాణ జాగృతి కన్వీనర్ పశుల చరణ్ అనుచరులతో కలిసి హత్య చేయించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలున్నాయి. తొలుత మాట్లాడుదామని చెప్పి జీవన్ ను మహాశక్తి ఆలయం వద్దకు తీసుకెళ్లిన చరణ్ అనుచరులు.. ఆపై అతన్ని చితకబాదారని బాధితుడి తరుపువారు ఆరోపిస్తున్నారు.
మహాశక్తి ఆలయం నుంచి జీవన్ ను కిడ్నాప్ చేసి.. అటుపై రేకుర్తి శివారు వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు యత్నించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 29న ఈ ఘటన జరగ్గా.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
బుధవారం నాడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా కరీంనగర్ లో నిర్వహించిన వేడుకల కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అంబేడ్కర్ సంఘం జీవన్ ను స్ట్రెచర్ పై వేదిక వద్దకు తీసుకురావడంతో.. మంత్రి ఈటెల జీవన్ ను పరామర్శించారు. చొరవ తీసుకున్న ఈటెల నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంగనర్ కమిషనర్ ను ఆదేశించారు. దీంతో జీవన్ పై దాడి చేసిన 9మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రోజుల వ్యవధిలో కరీంనగర్ లో ఇలాంటివి మూడు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. బొంపల్లిలో దళిత దంపతులను సీఐ వేధించడం, మంథని లో మధుకర్ అనుమానస్పద మృతి.. ఈ ఘటలన్ని వరుసగా చోటు చేసుకున్నవే.
వీటన్నింటిలో అధికారపక్షం వారు నిందితులకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications