అమ్మా..నాన్న.. అన్నా.. క్షమించండి: నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో వైద్య విద్యార్ధి ఆత్మహత్య!!
వరంగల్ నగరంలో వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందిన ఘటన తర్వాత వరుసగా వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నిజామాబాద్ మెడికల్ కళాశాలలో హర్ష అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, అతను మరణించిన నెల రోజులైనా కాకముందే మరో వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో మరో వైద్య విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా అందరి హృదయాలను కలచివేసింది. గత నెల అదే హాస్టల్ గదిలో హర్ష అనే వైద్య విద్యార్థి మృతి చెందగా, మళ్లీ అదే గదిలో సనత్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో విద్యార్థి సనత్ ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ మూడవ అంతస్తులోని 318 నంబరు గల రూంలో బెడ్ షీట్ తో ఈ తెల్లవారుఝామున ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రేపటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సిన తరుణంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. వైద్య విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. చదువుల ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్ ఫోన్ చాటింగ్ తో విద్యార్ధి మృతికి గల కారణాలను గుర్తిస్తున్నారు పోలీసులు.

సనత్ సెల్ ఫోన్లో అమ్మ, నాన్న, అన్నా.. నన్ను క్షమించండి అంటూ ఫార్మకాలజీ పరీక్ష రాసిన తర్వాతే ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను , కానీ నావల్ల స్నేహితులు డిస్టర్బ్ అవుతారని ఆగాను.. ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్ చేసాడు. అంతేకాదు అన్నయ్య సాయి నువ్వు యూఎస్ నుంచి వచ్చి ఇక్కడే ఉండు అంటూ చివరిసారిగా వాట్సాప్ లో తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక వైద్య విద్యార్థి మృతి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications