అమరావతి శంకుస్థాపన: రోడ్డు ద్వారా వద్దని కెసిఆర్కు ఎపి హెలికాప్టర్
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నుంచి తమ ప్రత్యేక హెలికాప్టరులో శంకుస్థాపన స్థలానికి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల భావిస్తున్నారు. ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారంసాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ నెల 21వ తేదీ రాత్రి నల్లగొండ సూర్యాపేటలో బస చేస్తానని తర్వాతి రోజు అమరావతి శంకుస్థాపనకు రోడ్డు మార్గాన ఉద్దండరాయునిపాలెంకు వస్తానని చంద్రబాబుతో కెసిఆర్ చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) అధికారులు సూర్యాపేట నుంచి ఉద్దండరాయునిపాలెం రూట్మ్యాప్ను అడిగారు.
దాంతో ఆంధ్రప్రదేశ్ అధికారులు రూట్మ్యాప్ ఇస్తూనే కెసిఆర్ సూర్యాపేట నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు హెలికాఫ్టర్లో రావాలని అక్కడి నుంచి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్లో ఉద్దరాయునిపాలెంకు ఎయిర్లిఫ్ట్ చేస్తామని ఎపి పోలీసు ఉన్నతాధికారులు సూచించాలని అనుకుంటున్నారు.
రోడ్డు మార్గం ద్వారా భద్రతా ఏర్పాట్లకు ఇబ్బంది కలుగుతుందని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్లో శంకుస్థాపన ప్రాంగణానికి రావాల్సిందిగా తెలంగాణ పోలీసులు అధికారులకు, సీఎంవోకు సూచించనున్నారు. ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని కోసం ఏర్పాటు చేసిన మూడు హెలీప్యాడ్లతో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాయబారుల కోసం ఐదు హెలీప్యాడ్లను ఏర్పాటు చేశారు.