బెజవాడ తరహాలోనే హైదరాబాద్ పాతబస్తీలో కాల్ మనీ: మహిళలు కూడా..
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోనూ కాల్మనీ తరహా వడ్డీ వ్యాపారం నడుస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పాతబస్తీలో ఫైనాన్స్ సంస్థలపై దక్షిణ మండల పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న ఫైనాన్స్ సంస్థలపై దక్షిణ మండలం పోలీసులు రెండు రోజులుగా దాడులు నిర్వహించారు. దాదాపు వంద మంది బాధితులు మంగళవారంనాడు దక్షిణ మండల డిసిపి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.
పాతబస్తీలో కాల్మనీ తరహాలో వడ్డీవ్యాపారం సాగిస్తున్నందున 86 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళా వ్యాపారులు కూడా ఉండడం విశేషం. వడ్డీకి ఇచ్చే మొత్తానికి ముందే అప్పుతీసుకున్నవారి ఆస్తులను వడ్డీవ్యాపారులు బాండ్ పేపర్లపై తమ పేరిట రాయించుకుంటున్నారు.
రుణం తీసుకున్నవారిని మానసికంగాను, మహిళలైతే లైంగికంగానూ వేధిస్తున్నారు. ఈ బాధలు భరించలేని కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
వారిలో 26మందిపై కేసులు నమోదు చేసి మరో 36మందిని విచారిస్తున్నారు. వీరిలో ఆరుగురిపై పిడి యాక్టు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. వడ్డీవ్యాపారం చేస్తున్న ఓ మహిళ కూడా పిడి యాక్టులో ఉండడం విశేషం.
హైదరాబాద్లో కాల్మనీ తరహాలో వడ్డీవ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దక్షిణ మండలం పోలీసులు రోజూ దాడులు నిర్వహిస్తారని డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీలో అక్రమ వడ్డీవ్యాపారం చేస్తున్న దాదాపు 292మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడులు కొన్ని రోజులపాటు నిరంతరం సాగుతాయని, ఫైనాన్స్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు.
దక్షిణ మండలం పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అక్రమ వడ్డీవ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపుతామన్నారు. బాధితుల ఫిర్యాదు చూస్తే ఎవరైనా కంట తడిపెడతారని ఆయన అన్నారు. కాల్ మనీ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని డిసిపి సత్యనారాయణ సూచించారు.