తెలంగాణాకు పాకిన రాజధానుల రగడ .. ఆదిలాబాద్ లో అసెంబ్లీ పెట్టాలట !!
ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేసిన ప్రకటనతో తెలంగాణలోనూ కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని,అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో తెలంగాణాలోనూ రచ్చ మొదలైంది.

తెలంగాణాలోనూ ఏపీ మూడు రాజధానుల ప్రభావం
ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల నుండి విశేషమైన మద్దతు వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఏపీ తరహాలో నిర్ణయాలు తీసుకోవాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కూడా జగన్ బాటలో నడవాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. తాజాగా ఇకపై అసెంబ్లీ సమావేశాలు ఆదిలాబాద్లో నిర్వహించాలంటూ బిజెపి ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ లో అసెంబ్లీ పెట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎంపీ
ఆదిలాబాద్ జిల్లా బాగా వెనుకబడిన జిల్లా అని, ఆదిలాబాద్ ను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవని అందుకే ఏడాదిలో రెండుసార్లు ఆదిలాబాద్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజెపి ఎంపీ సోయం బాపూరావు కోరారు. ఆదిలాబాద్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్న అంశంపై గవర్నర్ను కలుస్తామని బాపూరావు వెల్లడించారు.ఏపీలో తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఎందుకు తీసుకోరని ఆయన ప్రశ్నించారు.దశాబ్దాలుగా ఆదిలాబాద్ అభివృద్ధి చెందలేదని ఆయన తెలిపారు.

తెలంగాణలోనూ ఏపీలో సీఎం చేసే ప్రకటనల ప్రభావం
ఏది ఏమైనా ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద పడింది. ఇప్పుడు మూడు రాజధానులు చేస్తే బాగుంటుందని సూచనప్రాయంగా ప్రకటన చేసే దాని ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రంపై పడుతుందనేది తాజాగా బిజెపి ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications