Bonalu : ఘనంగా లాల్ దర్వాజ బోనాలు... అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్లో బోనాల పండగ సందడి నెలకొంది. నగరంలోని చాలాచోట్ల ఆది,సోమవారాల్లో స్థానిక ప్రజలు బోనాల పండగ జరుపుకుంటున్నారు. అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు బోనమెత్తుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంటిల్లిపాదీ ఆలయాలకు వెళ్లి 'తల్లీ తమను చల్లగా చూడు' అని వేడుకుంటున్నారు. పాతబస్తీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి... ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. సోమవారం(జులై 2) రంగం కార్యక్రమంతో పాటు ఘటాల ఊరేగింపు ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల పండగను అధికారికంగా గుర్తించిందని... ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. కరోనాను ప్రారదోలాలని... ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నట్లు చెప్పారు. అమ్మవారి కరుణతో ఈసారి సమృద్దిగా వర్షాలు కురిసి అన్ని ప్రాజెక్టులు నిండాయన్నారు.
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అమ్మవారికి బోనం సమర్పించుకున్నానని తెలిపారు.భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి బంగారు బోనం సమర్పిస్తానని అమ్మవారికి మొక్కుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దొరల రాజ్యం, దొంగల రాజ్యం నడుస్తోందని.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ప్రజా పాలన బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు.చెప్పారు.కరోనా నుంచి అందరం త్వరగా బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
బోనాల పండగ నేపథ్యంలో ఆది,సోమవారాల్లో హైదరాబాద్,సైబరాబాద్ పరిధిలోని వైన్ షాపులు,బార్లు,కల్లు దుకాణాలు మూసివేసిన సంగతి తెలిసిందే. నిబంధనలు బేఖాతరు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. మరోవైపు, పండగ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.పలు మార్గాల్లో వాహనాలను అనుమతించట్లేదు.