బాబు ఆర్డర్: ఆ తెలంగాణ ఉద్యోగుల ఆందోళన! 4గురు ఏపీకే
హైదరాబాద్: అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫీస్ ఉద్యోగుల విభజన కొంతమేర కొలిక్కి వచ్చింది. విభజన చేసి ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల జాబితాలను మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని నోటీసు బోర్డులో ఉంచారు. అయినా ఏపీ అసెంబ్లీ కార్యాలయంలోనే ఉండిపోయిన ఉద్యోగులు తీవ్ర నిరాశ, అసంతృప్తితో ఉన్నారు.
దీంతో బుధవారం ఇరువురు అధికారులు, పలువురు ఉద్యోగులు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిసి తమ ఆవేదన వెళ్లగక్కారు. అందుకు ఆయన స్పందిస్తూ.. ఈ విభజనపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు జూలై 14వ తేదీ గడువు విధించామన్నారు. కాబట్టి తర్వాత పరిశీలిస్తామన్నారు.
ఉభయ రాష్ట్రాల కౌన్సిల్, అసెంబ్లీలకు కలిపి మొత్తం 308 మంది ఉద్యోగులున్నారు. రాష్ట్ర విభజనకు ముందు, అంతకంటే ముందు 440 మంది ఉద్యోగులు ఉండేవారు. చాలామంది పదవీ విరమణ చేసినా, ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో ఉన్న వారిపైనే పని భారం పెరిగింది.
విభజన తర్వాత అసెంబ్లీ ఉద్యోగుల విభజన చేయడంతో ఏపీకి 170కి పైగా, తెలంగాణకు 130కి పైగా ఉద్యోగాలు వచ్చారు. నిష్పత్తి ప్రకారం ఏపీకే సుమారు 50 ద్యోగాలు అధికంగా వచ్చాయి. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందారు.
పైగా ఏపీ సిఎం చంద్రబాబు ఉద్యోగులు విజయవాడకు తరలి రావాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇది వారిలో ఆందోళన కలిగించింది. దీని పైన కమలనాథన్ కమిటీ కూడా చేతులెత్తేసింది. చట్టసభ కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని, ఇరు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, కార్యదర్శులు పరిష్కరించుకోవాలని సూచించింది.
దీంతో ఎపి కౌన్సిల్ చైర్మన్ చక్రపాణి, ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఇటీవల సమావేశమై ఉద్యోగుల విభజన అంశాన్ని చర్చించారు. ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చిన రాష్ట్రానికి ఆప్షన్ ఇచ్చుకోవాల్సిందిగా సూచించారు.
దీంతో ఆంధ్రలో ఉన్న తెలంగాణకు చెందిన సుమారు 50 మంది ఉద్యోగులు తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారు. దీనిపై అసెంబ్లీల కార్యదర్శులు తర్జనభర్జన చేసి ఉద్యోగుల విభజన చేసి నోటీసు బోర్డులో పెట్టారు. కాగా తెలంగాణ ఆప్షన్ ఇచ్చినా విభజనలో బదిలీ కాని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బదిలీ కాకుండా ఆంధ్రలో ఉండిపోయిన అసిస్టెంట్ కార్యదర్శి సంజీవ రావు, సెక్షన్ ఆఫీసర్ వేణు, టెలిఫోన్ ఆపరేటర్, ఇద్దరు స్వీపర్లు, అటెండర్ ఆందోళన చెందుతున్నారు. బుధవారం సంజీవరావు, వేణు ప్రభృతులు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను కలిసి తమ గోడు చెప్పుకున్నారు.
ఇదిలా ఉండగా, తాజాగా తీసుకున్న విభజన నిర్ణయంతో సుమారు 50 మంది ఉద్యోగులు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చారు. ఏపీ అసెంబ్లీ కార్యాలయంలో భారీగా సంఖ్య తగ్గింది. తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రమైన ఏపీ అసెంబ్లీ కార్యాలయంలో 136 మంది ఉద్యోగులు, తెలంగాణకు 172 మంది ఉద్యోగులు మిగిలారు.
ఆంధ్రకే ఆప్షన్ ఇచ్చిన నలుగురు తెలంగాణకు చెందిన ఉద్యోగులు హనుమంతరావు, కుమారస్వామి, శ్రీనివాస్, సునీల్లను ఆంధ్ర అసెంబ్లీకే ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60కి పెంచినందున అలా కోరుకుని ఉంటారని భావిస్తున్నారు.