ఎన్నికల తనిఖీల్లో రూ. 500 కోట్లు దాటిన స్వాధీనాల మొత్తం: వివరాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో నగదు, బంగారం, ఇతర రూపంలో అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 538.23 కోట్లకుపైగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శుక్రవారం వెల్లడించారు.
గడిచిన 24 గంటల్లోనే స్వాధీనమైన వాటి విలువ రూ. 5.77 కోట్లకుపైగా ఉందని వెల్లడించారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకున్న వివరాలు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు:
నగదు: రూ. 184.89 కోట్లు
బంగారం, వెండి, ఇతర దుకాణాలు: రూ. 178.61 కోట్లు
లిక్కర్: రూ. 74.71 కోట్లు
మత్తు పదార్థాలు: రూ. 31.64 కోట్లు
రూ. 68.36 లక్షలకుపైగా విలువైన చీరలు, బియ్యం, మొబైల్స్, ఇతర వస్తువులు, కానుకలను స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు వేశారు. కాగా, నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. నవంబర్ 30 ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం.. అది చేస్తామంటూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగసభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ప్రజల తీర్పు మాత్రం డిసెంబర్ 3న వెలువడనుంది.












Click it and Unblock the Notifications