తండ్రీకొడుకులకు పంచాయితీ పెట్టారు... అసలు అసెంబ్లీ ఎందుకు జరుగుతుందో.. ఎందుకొస్తున్నామో : సీతక్క
శాసనసభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. ఆహా... ఓహో... అంటూ ఎంతసేపు ప్రభుత్వాన్ని పొగడటమే తప్ప ప్రజా సమస్యల ప్రస్తావనకు అవకాశం ఇవ్వట్లేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వాల హయాంలోనూ ఇలా జరగలేదని అన్నారు.గురువారం(మార్చి 25) అసెంబ్లీ బయట గన్పార్క్ వద్ద సీతక్క మీడియాతో మాట్లాడారు.
తండ్రీకొడుకులకు పంచాయితీ పెట్టిన ప్రభుత్వం : సీతక్క
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం ద్వారా తండ్రీ కొడుకులకు ప్రభుత్వం పంచాయితీ పెట్టిందని సీతక్క విమర్శించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచిన ప్రభుత్వం... నిరుద్యోగుల వయోపరిమితి గురించి పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల వయోపరిమితిని పెంచకపోవడంతో చాలామంది యువత ఉద్యోగాలకు దూరమవుతారని సీతక్క పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడితే వెంటనే మైక్ కట్ చేస్తారని... కానీ సబ్జెక్టుతో సంబంధం లేకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతసేపు మాట్లాడినా అవకాశమిస్తారని చెప్పారు.
రాష్ట్రం 70 ఏళ్లు వెనక్కి... : సీతక్క
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిపక్ష నేతలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేవారని అన్నారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడితేనే ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తాయన్న ఉద్దేశంతో వారికి అవకాశమిచ్చేవారని చెప్పారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం ఉంటే రాష్ట్రం మరో 70 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు. బ్రిటీష్ కాలంలో కొనసాగినట్లే ఇప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడనివ్వకుండా అణచివేత కొనసాగుతోందన్నారు.
అసెంబ్లీకి ఎందుకొస్తున్నామో అర్థం కావట్లేదు : సీతక్క
అసెంబ్లీ ముందు ప్రతీరోజూ ఆయా సంఘాలు,యూనియన్లు ధర్నాలు,ఆందోళనలు చేపడుతూనే ఉన్నారని సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వం వారిని అడ్డుకోవడం కాకుండా... వారి సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో చర్చ చేస్తే బాగుంటుందని సూచించారు. ఆఖరికి మీడియాపై కూడా ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంతా బాగానే సాగుతుందన్న భ్రమల్లో జనాన్ని ముంచెత్తేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నామో కూడా అర్థం కావట్లేదన్నారు. కాబట్టి ప్రజలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను గమనించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు ఇది కానే కాదని.. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా సమావేశాలు జరగట్లేదని అన్నారు.