కేసీఆర్ లా వ్యవహరిస్తే అసెంబ్లీ రద్దయ్యేది : డ్రగ్స్ - అవినీతి పై అమిత్ షా కు చెప్పా : గవర్నర్ సంచలనం..!!
తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ రాజ్ భవన్ మధ్య కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. గవర్నర్ తమిళి సై ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తరువాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రధానితో భేటీ తరువాత తెలంగాణలో తనకు అవమానం జరిగినా తాను పట్టించుకోనని..గవర్నర్ హోదా - రాజ్ భవన్ కు అవమానం జరుగుతున్న అంశాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక, అమిత్ షా తో భేటీ తరువాత సైతం గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ పర్యటనలో మీడియా ప్రతినిధులతో ఇష్ఠాగోష్ఠీగా మాట్లాడిన గవర్నర్ పలు అంశాల పైన స్పందించారు.

ప్రభుత్వాన్ని పడగొట్టడం తనకు ఇష్టం లేదంటూ
తాను సైతం కేసీఆర్ లా వ్యవహరించాలని అనుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేదని గవర్నర్ సంచలన వ్యాఖ్య చేసారు. అసెంబ్లీలో ప్రసంగం చేయకపోయినప్పటికీ శాసనసభ సమావేశం కావడానికి గవర్నర్ అనుమతించాల్సి ఉంటుందని..ఆరు నెలలపాటు సమావేశం కాకపోతే అసెంబ్లీ రద్దవుతుందని గుర్తు చేసారు. గత ఏడాది సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాలు జరిగాయని.. దాదాపు 5 నెలల రెండు వారాల వ్యవధి తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయన్నారు.
బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి అనుమతి కోరుతూ వచ్చిన ఫైలును మరో 15 రోజులపాటు పెండింగ్లో పెడితే రాజ్యాంగ నిబంధనల మేరకు అసెంబ్లీ రద్దయ్యేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. కానీ, తాను అలా చేయలేదని.. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం తనకు ఇష్టం లేదని తెలిపారు.

పరామర్శకు రాలేదంటూ ఎమోషనల్
గతంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇలా చేసిందని, దానిని తాను సమర్థించబోనని చెప్పారు. తన తల్లి మరణించిన సమయంలో పరామర్శించాలనే కనీస మర్యాద కూడా సీఎం కేసీఆర్ కు లేదన్నారు. తాను ఫోన్ చేసినా పట్టించుకోలదని చెప్పారు. మూడు గంటల పాటు పార్దివ దేహం రాజ్ భవన్ లోనే ఉందని..అయినా పరామర్శకు రాలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇటీవల కాలంలో హైదరాబాద్ వచ్చిన ప్రధానికి స్వాగతం పలకటానికి కేసీఆర్ ఎందుకు రాలేదనని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ప్రధాని వస్తే స్వాగతం పలకడం రాజ్యాంగపరమైన విధి గా స్పష్టం చేశారు. ఏదైనా కీలక అంశాలు ఉంటే లేదా పుదుచ్చేరి వెళ్లే ముందు సీఎంకు ఫోన్ చేసి చెప్పేదాన్నని... తర్వాత కాలంలో ఫోన్కు స్పందించలేదని వివరించారు. కేసీఆర్ జన్మదినంనాడు ఫోన్ చేశానని.. బొకే పంపించానని చెప్పారు.

చరిత్రలో తప్పుగా రికార్డు అవుతుంది
ఇటీవల కేసీఆర్ ఆస్పత్రిలో చేరితే బొకే పంపించినా..ఆయన స్పందించలేదన్నారు. కేసీఆర్ది మంచి పద్ధతి కాదని చెబుతూ... చరిత్రలో ఇది తప్పుగా రికార్డు అవుతుందని వ్యాఖ్యానించారు. పది నెలల కాలంగా సీఎం రాజ్ భవన్ కు రాలేదన్నారు. తాను ఆస్పత్రులను సందర్శించటం.. రాజ్భవన్ ముందు ఫిర్యాదుల బాక్స్..కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించకపోవడం తో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని అనుకుంటున్నట్లుగా చెప్పారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుందని... ప్రసంగ ప్రతి కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాం. కానీ, ప్రభుత్వం స్పందించలేదన్నారు. దాంతో, తన ప్రసంగం నేనే తయారు చేసుకున్నానని వివరించారు. ఉగాది వేడుకలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అందరినీ ఆహ్వానించినా ఎందుకు రాలేదని తమిళిసై అడిగారు.
Recommended Video

అందులో కేసీఆర్ దిట్ట
తాను మేడారం వెళ్లినప్పుడు గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, కలెక్టర్, ఎస్పీ ఎందుకు రాలేదని నిలదీశారు. . గొప్ప సంస్కృతి గల తెలంగాణలో ఒక మహిళను అవమానించడం, విస్మరించడం సబబేనా అని నిలదీశారు. తనకు గౌరవం ఇవ్వాలని కోరుకోవడం లేదని, గవర్నర్ కార్యాలయానికి గౌరవం ఇవ్వాలని సూచించారు.
తాను రాజకీయాలు చేస్తున్నానని ఆరోపించడం, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. డ్రగ్స్..అవినీతి అంశాల పైన అమిత్ షా తో చర్చిచానని.. అన్ని అంశాలను బయటపెట్టలేనని తెలిపారు.కేసీఆర్.. సెంటిమెంట్లను ఉపయోగించుకోవడంలో దిట్టముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా చేయగలరని, తిమ్మిని బమ్మి చేస్తారని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications