ఎర్రగడ్డ కూతురుపై దాడిలో కొత్త కోణం: పరువు కోసం కాదు, అందుకే సందీప్పై తొలుత దాడి
Recommended Video
హైదరాబాద్: ఎస్సార్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు మాధవి, అల్లుడి సందీప్పై మామ నర్సింహాచారి కత్తితో దాడి చేసిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎర్రగడ్డలోని ప్రేమ్నగర్కు చెందిన 21 ఏళ్ల సందీప్, బోరబండ రాజ్నగర్కు చెందిన 20 ఏళ్ల మాధవిలకు నాలుగేళ్ల క్రితం ఇంటర్ ఎగ్జాం సెంటర్లో పరిచయమైంది. నాటి నుంచి తరచు కలుసుకునేవారు.
చదవండి: హైదరాబాద్లో మరో మారుతీరావు, కూతురు-అల్లుడిపై కత్తితో దాడి, ఆమె పరిస్థితి అత్యంత విషమం
సందీప్ కూకట్పల్లిలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతూ సాయంత్రం పూట ఓ బిర్యానీ సెంటర్లో పనిచేస్తుండేవాడు. మాధవి సనత్నగర్లో డిగ్రీ చదువుతోంది. మాధవి తండ్రి మనోహరాచారి. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను తండ్రి వ్యతిరేకించాడు. కుమార్తెతో పాటు సందీప్ను పలుమార్లు హెచ్చరించాడు. మాధవిని ఆమె మేనబావకు ఇచ్చి పెళ్లిచేసేందుకు ప్రయత్నించాడు. దీంతో మాధవి నేరుగా తాను ప్రేమిస్తున్న సందీప్ ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పడంతో కొందరు మిత్రులు కలిసి వీరి పెళ్లిని ఈ నెల 12న ఆర్య సమాజ్లో చేశారు.
పరువు కోసమో, కులాంతర వివాహం కోసమే చేసిన దాడి కాదు
సందీప్, మాధవిలపై జరిగిన దాడికి కులాంతర వివాహమో, పరువు కోసమో కాదని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కేవలం కుమార్తె తనకు తెలియకుండా పెళ్లి చేసుకుందన్న కారణంతోనే తండ్రి మనోహరాచారి ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. మాధవి ప్రేమ విషయం మనోహరాచారి భార్య లక్ష్మి, కొడుకు నవీన్లకు తెలుసు. ప్రేమిస్తున్న కూతురు, విషయం తెలిసిన తల్లి, కొడుకులు ఎవరూ ఆయనకు చెప్పలేదన్నారు. ఆమె బావతో మనోహరాచారి కూతురుకు పెళ్లి చేయాలనుకున్నాడని, అంతలో ప్రేమ వ్యవహారం తెలియడంతో ఆయనకు ఆగ్రహం కలిగిందన్నారు. ఇది కులాంతర వివాహం కోసం చేసిందో, పరువు కోసం చేసిన దాడో కాదన్నారు. తాను ఒకరితో పెళ్లి చేద్దామని సిద్ధం కావడం, తనకు తెలియకుండా పెళ్లి చేసుకోవడంతో మనోహరాచారి తీవ్ర మనోవేధనకు గురై నాలుగైదు రోజులుగా విపరీతంగా తాగుతున్నాడు. ఈ బాధలో కూతుర్ను చంపాలనుకున్నాడు. ఆమెను చంపేందకు కొబ్బరిబొండాం దుకాణంలో కత్తిని దొంగిలించాడని డీసీపీ తెలిపారు.
అమ్మా రమ్మని చెప్పి... అందుకే ముందు సందీప్ పైన దాడి
బుధవారం మధ్యాహ్నం మనోహరాచారి కూతురు మాధవికి ఫోన్ చేసి.. అమ్మా... చూడాలని ఉందని చెప్పారు. ఈ నెల 17 నుంచే వారి హత్యకు ప్రణాళిక వేశాడు. బుధవారం మధ్యాహ్నం ఫోన్ చేసి ఇద్దరికీ కొత్తబట్టలు పెడతానని, ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద ఉన్న హ్యుండాయ్ షోరూం వద్దకు రమ్మని చెప్పాడు. మాధవి, సందీప్లు బైక్ పైన వచ్చారు. మనోహరాచారి తాను కూడా కొద్దిసేపటికే తన బైక్ పైన వచ్చాడు. అప్పుడు తొలుత సందీప్ పైన దాడి చేయగా, అతను పారిపోయాడు. ఆ తర్వాత కూతురుపై దాడి చేశాడు. కూతురే టార్గెట్ అనుకున్నప్పుడు సందీప్ పైన ఎందుకు దాడి చేశాడని డీసీపీని మీడియా అడగ్గా... సందీప్ భయంతో పారిపోతే కుమార్తెను చంపొచ్చనేది తన ఉద్దేశమని తెలిపారు.
పెళ్లి కోసం అంతా సిద్ధం చేస్తున్నా.. కూతురు చెప్పకుండా పెళ్లి
మనోహరాచారి 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. బోరబండలో ఉంటూ చిన్న, చిన్న పనులు చేసేవాడు. కొన్నేళ్ల నుంచి సమీపంలోని బంగారం దుకాణంలో పని చేస్తూనే సన్నిహితులు, బంధువులకు బంగారు ఆభరణాలు ఆర్డర్పై తయారు చేసి ఇచ్చేవాడు. భార్య లక్ష్మి హైటెక్ సిటీ ప్రాంతంలో పని చేస్తున్నారు. కొడుకు నవీన్, కూతురు మాధవిలను డిగ్రీ చదివారు. మాధవికి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో రెండు నెలల క్రితం బోరబండలోని వినాయక్నగర్ నుంచి రాజ్నగర్ బస్తీకి వచ్చి పెద్ద ఇంటిని కిరాయికి తీసుకున్నారు. తండ్రి పెళ్లి కోసం ఇంత సిద్ధం చేస్తున్నా ఆయనకు కూతురు ప్రేమ, పెళ్లి విషయం చెప్పలేదు. తెలియకుండా పెళ్లి చేసుకుంది. దీంతో అతనికి కోపం వచ్చింది. సందీప్ తన తల్లి రమాదేవితో కలిసి ప్రేమ్నగర్లో నివసిస్తున్నారు. సందీప్కు తండ్రి లేడు. బంధువులు నిర్వహించే బిర్యానీ సెంటర్లో క్యాషియర్గా పని చేస్తున్నాడు.
అందరి కన్నీరుమున్నీరు
ఓవైపు తండ్రి పెళ్లి చేద్దామని సిద్ధమయ్యే వరకు అతనికి ఎవరూ చెప్పకపోవడం, అతని ఆవేశం, ఆగ్రహం సందీప్, మాధవిలపై దాడికి పాల్పడేలా చేసింది. చావుబతుకుల్లో ఉన్న మాధవి, గాయాలపాలైన సందీప్ పరిస్థితిని చూసి బంధువులు, సన్నిహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రేమికులిద్దరూ భార్యాభర్తలైన వారం రోజులకే ఇలా జరగడం వారి కుటుంబాల్లో విషాదం నింపింది.
ఎప్పటికప్పుడు హెచ్చరించిన మిత్రులు
సందీప్, మాధవిలు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతడి మిత్రులు సురేష్, సతీష్లు మనోహరాచారిని అనుమానిస్తున్నారు. ఈ నెల 14న మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన కుమార్తె అమృత భర్త ప్రణయ్ను చంపించిన తర్వాత వారిలో భయం మరింత పెరిగింది. సందీప్ను కూడా అలాగే చంపేస్తాడనుకున్నారు. సందీప్, మాధవిలను ఎప్పటికప్పుడు హెచ్చరించారు. వారు అనుమానించినట్లే జరిగింది. కానీ ఇది పరువు హత్య లేదా కులాంతర వివాహమని చేసిన దాడి కాదు. ఒకరికి పెళ్లి చేద్దామని అంతా సిద్ధం చేసుకున్నాక, తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకోవడం ఆగ్రహం తెప్పించి, ఇంత దారుణణానికి ఒడిగట్టాడు. అతని టార్గెట్ కూతురే, కానీ అల్లుడు కాదు.