హైకోర్టును విభజిస్తే.. బాబు కథ తేలుద్ది, ఆ ఊతపదాలు బాబువే : బాబుమోహన్
హైదరాబాద్ : మొత్తానికి అంతా భావించినట్లే.. ఓటుకు నోటులోను ఏపీ సీఎం చంద్రబాబు స్టే తో గట్టెక్కారు. అయితే విచారణకు హాజరు కాకుండా ఇలా దొడ్డిదారిన తప్పించుకోవడమేంటని ఓ పక్కన ప్రతిపక్ష పార్టీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. స్టే తెచ్చుకుంటే తెచ్చుకున్నారు గానీ నైతికంగా ప్రజల ముందు మాత్రం చంద్రబాబు ఎప్పుడో దోషిగా నిలబడ్డారనేది వారి వాదన.
ఇదంతా ఇలా ఉంటే.. అసలు ఓటుకు నోటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చడీ చప్పుడు లేనట్లుగా వ్యవహరించడం కూడా చర్చనీయాంశమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై స్పందించారు టీఆర్ఎస్ ఎమ్మల్యే బాబుమోహన్. బాబు మోహన్ చెబుతున్నదేమంటే.. సుదీర్ఘ కాలం టీడీపీలో చంద్రబాబుతో పనిచేసిన అనుభవం రీత్యా.. ఓటుకు నోటు ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని తేల్చి చెప్పారాయన.
దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు బాబుమోహన్. ముఖ్యంగా డోన్ట్ బాదర్, ఐయామ్ విత్ యూ లాంటి ఊతపదాలు చంద్రబాబు నోటివెంట ఎపుడూ వస్తుంటాయని చెప్పారు. హైకోర్టు విభజన జరగితేనే ఓటుకు నోటు కేసు ఓ కొలిక్కి వస్తుందన్న బాబుమోహన్.. హైకోర్టులో ఆంధ్రా పక్షం పట్టు ఎక్కువ ఉందన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
ఆడియో టేపుల్లో అంత స్పష్టంగా చంద్రబాబు గొంతు వినిపిస్తుంటే.. ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంటుందన్నారు బాబుమోహన్. కొందరు ఎధవల మాటలు విని చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదని.. దానివల్లే పార్టీ మారాల్సి వచ్చింది తప్ప పార్టీలు మారే రాజకీయాలకు తాను వ్యతిరేమని చెప్పుకొచ్చారు. తనకు టీడీపీ టికెట్ ఇవ్వని సందర్బంలో.. తనకు ఫోన్ చేసిన కేసీఆర్.. టీఆర్ఎస్ లోకి వచ్చేయమని ఆహ్వానించారని, ఇప్పుడు కూడా పార్టీలో తనకు తగిన గౌరవమిస్తున్నారని అన్నారు.
ఇక తన మీద తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ.. ఏబీఎన్ ఛానల్ పై మండిపడ్డారు బాబుమోమన్. తాను అట్లాంటి వాడినని, ఇట్లాంటి వాడినని, అందరిని బండ బూతులు తిడుతున్నానని తనమీద పనిగట్టుకుని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బాబుమోహన్ ఆరోపించారు. ఇక పార్టీ మారుతున్నానని కూడా సదరు ఛానెల్ లో ఊదరగొడుతున్నారని.. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడానికేనా.. ఛానెల్ పెట్టిందంటూ ప్రశ్నించారు.
ఎవడో చెప్పిందాన్ని పట్టుకుని ఎలా రాస్తారంటూ ప్రశ్నించిన బాబుమోహన్.. ధైర్యముంటే నేరుగా తన వద్దకే వచ్చి అడగాలని సూచించారు. రాజకీయాల్లో తాను నిజాయితీగా కొనసాగుతున్నానని చెప్పిన బాబుమోహన్.. లంచాలు తీసుకునేవాళ్లు తనకు చీడపురుగుల్లా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని బాబుమోహన్ గుర్తు చేశారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్బంగా ఇలా తన అభిప్రాయాలను వ్యక్తపరిచారాయన.