పేదలపై భారం మోపి.. ఖజానా నింపుకుంటారా?: నిజాంకు పట్టినగతే.: కేసీఆర్పై బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు పోరాడుతామని ఈ కరీంనగర్ ఎంపీ అన్నారు. కరోనాతో నష్టపోయిన ప్రజలపై భారం తగదన్నారు.

కరోనా పరిస్థితుల్లో పేదలపై ఇంత దారుణమా?
ఎల్ఆర్ఎస్ నిబంధనలు అత్యంత దారుణంగా ఉన్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరోనా విలయంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టడం దారుణమన్నారు.
లాక్డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి కొందరు, వ్యాపారాలు నడవక మరికొందరు తీవ్ర ఇబ్బందుల మధ్య జీవనాన్ని నెట్టుకొస్తుస్తున్నారని అన్నారు. కేవలం కనీస అవసరాలు తీర్చుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ను తెరపైకి తీసుకురావడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ప్రజలపై భారం మోపి.. ఖజానా నింపుకుంటారా?
ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట చేపట్టిన ఆందోళనలు విజయవంతమయ్యాయని బండి సంజయ్ తెలిపారు. కరోనా కష్టకాలంలో ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టడం సరికాదన్నారు. జనంపై భారం మోపుతూ ఖజానా నింపుకోవాలన్నా ప్రభుత్వ ఆలోచన దారుణమని సంజయ్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్లో ప్రభుత్వం పెట్టిన నిబంధనలు చూస్తే ఇంత ఘోరమా అనిపిస్తోందని, గతంలో పదిసార్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని నిబంధన పెట్టడం అర్ధరహితమని విమర్శించారు.
Recommended Video

నిజాంకు పట్టిన గతే..
పాలనా వైఫల్యాలతోపాటు కేసీఆర్ సర్కారు కొట్టుమిట్టాడుతోందన్నారు. నిజాం పాలనలోనూ కొత్త కొత్త పన్నులు విధిస్తూ ప్రజల్ని పీడించారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఆనాడు ఏ విధంగా తిరగబడ్డారో.. కేసీఆర్ సర్కారుపైనా ప్రజలు అదేవిధంగా తిరుగుబాటు చేస్తే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే ఎల్ఆర్ఎస్కు బీజేపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైంది.












Click it and Unblock the Notifications