హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ఉండే వారికి బిగ్ అలెర్ట్..!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. నేడు ( డిసెంబర్ 2, 2025.. మంగళవారం ) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం చోటు చేసుకోనుంది. నిర్వహణ, మరమ్మతు పనుల కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో విద్యుత్ నిలిపివేయనున్నారు. పనులు ముందుగానే పూర్తైతే షెడ్యూల్కు ముందుగానే సరఫరా పునరుద్ధరిస్తామని కూడా స్పష్టం చేశారు.
కాగా బంజారాహిల్స్ ఏడీఈ జి. గోపీ వివరాల ప్రకారం.. ఉదయం 10-1 గంటల మధ్య 11కేవీ స్టేట్ హోమ్, నాందారి టెంట్ హౌస్ ఫీడర్లకు విద్యుత్ ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 2-5 గంటల మధ్య 11కేవీ ఎల్లారెడ్డిగూడ, బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రి ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు గ్రీన్ల్యాండ్స్ ఏడీఈ ఎల్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉదయం 10-1 గంటల మధ్య 11కేవీ జయప్రకాష్ నగర్, పీలి దర్గా, అవంతి నగర్ ఫీడర్లలో మరమ్మతుల కోసం సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మధ్యాహ్నం 2-5 గంటల వరకు 11కేవీ కార్మిక నగర్ ఫీడర్ పరిధి కూడా ప్రభావితం కానుంది. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ను యథావిధిగా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే అధికారులు ప్రజలకు కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా హోం అప్లయెన్సెస్ను ఆఫ్లో ఉంచడం, ఇన్వర్టర్లు, ఛార్జింగ్ పరికరాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవడం, అత్యవసర అవసరాలకు తగినట్లుగా నీటి నిల్వలు చేసుకోవడం మంచిదని తెలిపారు. విద్యుత్ నిలిపివేత కారణంగా హాస్పిటల్స్, వ్యాపార సంస్థలు, చిన్న పనిదారులు తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని.. అందుకు తగ్గ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు.
ఈ షెడ్యూల్ నగరంలోని ముఖ్యమైన రోడ్లు, కాలనీలు, వాణిజ్య ప్రాంతాలను ప్రభావితం చేయనున్నప్పటికీ.. భవిష్యత్తులో సేవల నాణ్యతను మెరుగుపర్చడానికి ఇవి అవసరమైన చర్యలేనని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications