హుజూరాబాద్ లో బిగ్ ఫైట్ : పోలింగ్ ప్రారంభం - చివరి నిమిషం వరకు ఉత్కంఠే..!!
తెలంగాణలో రాజకీయంగా ఉత్కంఠ కారణమవుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. అధికారులు ఇప్పటికే పోలింగ్కు అన్ని సర్వసన్నద్ధం చేశారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు జరగనున్న పోలింగ్తో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తెల్చనున్నారు. ప్రతి ఓటరు విధిగా మాస్కును ధరించడంతోపాటు కొవిడ్ నిబంధనల్ని పాటించాలని అధికారులు ఓటర్లకు సూచించారు.
2.37 లక్షల ఓటర్ల తీర్పు
హుజురాబాద్లో మొత్తం ఓటర్లు రెండు లక్షల 37 వేల మంది ఉండగా 36 మంది బరిలో ఉన్నారు. ఐదు మండలాల్లో 306 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికకు 421 కంట్రోల్ యూనిట్స్, 891 బ్యాలెట్ యూనిట్స్ ను అధికారులు సిద్ధం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత కోవిడ్ పేషంట్స్కి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా, ఎన్నికలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా...
ప్రజల్లో తమపై వ్యతిరేకత లేదని అధికార పార్టీ టీఆర్ఎస్ నిరూపించుకోవాలని భావిస్తుండగా... తనను అవమానించి బయటకు పంపిన పార్టీకి తన సత్తా ఏంటో చూపించాలని బీజేపీ అభ్యర్థి ఈటెల ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికల కోసం 1,715 మంది సిబ్బందిని నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. 3,880 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
భారీ బందోబస్తు.. కోవిడ్ ప్రోటోకాల్
శాంతియుత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ జరిగేలా ప్రజలు సహకరించాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే ఫేక్ న్యూస్ నమ్మవద్దని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద శానిటైజ్ చేసుకునేందుకు ఏర్పాట్లు ఉంటాయని, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ కర్ణన్ వివరించారు. ఇక, ఈ ఎన్నికల్లో మొత్తం అయిదు మండలాల్లోనూ గతంలో ఉన్న పట్టును..పార్టీ మారినా నిరూపించుకొనేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్
పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే అక్కడక్కడా ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతునర్నాయి. సాయంత్రం ఏడు గంటల వరకు లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే సమయంలో పోలింగ్ సరళి ద్వారానే తమ గెలుపు - ఓటముల గురించి అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఎక్కువ పోలింగ్ జరిగే విధంగా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.