పెద్ద నోట్ల రద్దు: కోడికూరలో విషం కలిపి తిన్నారు, తండ్రీకొడుకుల మృతి
సిద్ధిపేట: పెద్ద నోట్ల రద్దుతో తన భూమిని ఎవరూ కొనకపోవడంతో అప్పులబాధ తాళలేక ఓ రైతు కోడికూరలో విషం కలిసి తాను తినడంతో పాటు కుటుంబసభ్యులకూ తినిపించాడు. ఈ ఘటనలో కుటుంబంలోని ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మంగళవారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ధర్మారం గ్రామానికి చెందిన వర్ద బాలయ్య(42) తనకున్న నాలుగు ఎకరాల భూమిలో రెండు బోరు బావులతో వ్యవసాయం చేస్తున్నాడు. సాగు కోసం చేసిన అప్పులతో పాటు నాలుగేళ్ల క్రితం పెద్ద కుమార్తె శిరీష వివాహం, తదితర అవసరాల కోసం రూ.10 లక్షలు అప్పు చేశాడు. వీటిని తీర్చే మార్గం లేకపోవడంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడు.

తాను ఒక్కడినే ఆత్మహత్య చేసుకుంటే కుటుంబసభ్యులకు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఇంట్లో వండిన కోడిమాంసంలో రహస్యంగా విషం కలిపినట్టు పోలీసులు తెలిపారు. తాను తినడంతో పాటు కుటుంబసభ్యులకు పెట్టాడు. దీంతో అస్వస్థతకు గురైన బాలయ్య తండ్రి గాలయ్య(70) మృతిచెందాడు.
ఇరుగుపొరుగు స్పందించి మిగతావారిని సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రైతు బాలయ్య కూడా మృతిచెందాడు. అతని భార్య బాలలక్ష్మి, కుమారుడు ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
గాలయ్య, బాలయ్యల మృతదేహాలను సిద్దిపేట ఏరియాసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. కాగా, బాలయ్య చిన్నకుమార్తె అఖిల, వృద్ధురాలైన తల్లి వజ్రవ్వలు కోడికూర తినకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అప్పు తీర్చేందుకు బాలయ్య.. ఎకరం భూమి అమ్మాలన్న ఆలోచనలో ఉన్నాడని, పెద్ద నోట్లు రద్దు చేయడంతో భూమి కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదని, ఈ నేపథ్యంలో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, సిద్దిపేట జిల్లా జేసీ హన్మంతరావు, ఏసీపీ నర్సింహరెడ్డిలు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలయ్య, గాలయ్యల మృతికి కేంద్రమే పూర్తి బాధ్యతను వహించాలని డిమాండ్ చేశారు.
అప్పులను తీర్చడానికి తన భూమిని అమ్మి అప్పులను తీర్చుదామనుకున్న బాలయ్యకు నోట్ల రద్దుతో ఏమిచేయలేకపోయాడని, భూమిని ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో కుటుంబసభ్యులతో ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్దొడ్డి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications