పెద్ద నోట్ల రద్దుతో ముల్కనూరు సహకార బ్యాంక్ విలవిల!
ప్రపంచ ప్రసిద్ధి పొందిన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పెద్ద నోట్ల రద్దు దెబ్బతో విలవిల లాడుతోంది.
వరంగల్: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పెద్ద నోట్ల రద్దు దెబ్బతో విలవిల లాడుతోంది. ఆర్బీఐ... సహాకార బ్యాంకుల లావాదేవీలను నిలిపి వేయడంతో రైతులు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అప్పులు చెల్లించే అవకాశం కూడా లేకుండా పోయింది. ఫలితంగా రైతుల ఇళ్లల్లో వ్యవసాయ ఉత్పత్తులు పేరుకుపోయి కనిపిస్తున్నాయి.
60 ఏళ్ల బ్యాంకు చరిత్రలో ఎన్నడూ ఇంత కష్టకాలాన్ని ఎదుర్కొన్న దాఖలాలు లేవని సభ్యులు అంటున్నారు. జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఉన్న ముల్కనూర్ సహకార గ్రామీణబ్యాంకు పెద్ద నోట్ల రద్దు దెబ్బతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. సొసైటీ సభ్యులైన రైతులకు ఆర్థిక చేయూతనందించలేక పోతోంది. పంట చేతికొచ్చినా అమ్ముకునే అవకాశం లేదు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళాల్లో, ఇళ్లల్లో నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. రైతులకు సరియైన సమయంలో రుణాలు లభించకపోతే రబీ వ్యవసాయం ఇబ్బందికరంగా మారుతుంది. కరువు తర్వాత పుష్కలంగా వర్షాలు కురవడంతో చెరువులు కళకళలాడుతున్నాయి. రబీలో వ్యవసాయం బాగా చేయొచ్చని ఆశ పడ్డారు. పండిన పంట అమ్ముకోలేక తిరిగి రుణం పొందలేక రైతాంగం దిక్కుతోచని స్థితిలో కొట్టు మ్టిడుతున్నారు.

ఇదే సహకారం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కొద్ది నెలల ముందు హైదరాబాద్ రాష్ట్ర ఏలుబడిలోనే ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు ఏర్పాటైంది. స్థానిక విద్యాధికులైన యువకులు పెద్ద ఉద్యోగాల కోసం ఆశపడకుండా ఉన్న ఊరికి, పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో అల్గిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో 1956లో స్థాపించారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా కొనసాగిన ఈ బ్యాంకు అభివృద్ధి బాటలో పయనించి అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది.
బహిరంగ మార్కెట్లలో రైతులను దళారుల నుంచి కాపాడే లక్ష్య సాధనలో విజయం సాధించింది. స్వల్ప మొత్తం వాదనంతో ప్రారంభమైన ఈ బ్యాంకు ఇపుడు టర్నోవర్ రూ. 240 కోట్లతో నడుస్తోంటే బ్యాంకు ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. ఇంత ఘన చరిత్ర కలిగిన బ్యాంకు ఇపుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నది. పెద్దనోట్ల రద్దు వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం దారుణం అంటున్నారు.
ప్రస్తుత సీజన్లో సకాలంలో రుణాలు అందించకపోవడం వల్ల అనేక రకాల అనుబంధ సమస్యలు ఏర్పడతాయంటున్నారు. రుణాలు సకాలంలో రాకపోవడంతో వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు రాలేరు. పంటల దిగుబడి తగ్గి ఉత్పాదకత మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు.
అప్పులు బంద్
యేటా రెండు సీజన్లకు కలిపి ఈ గ్రామీణ బ్యాంకు నుంచి రైతులు రూ. 80 కోట్ల రుణాలు పొందుతారు. తిరిగి అదే స్థాయిలో అంటే దాదాపు రూ. 75 కోట్ల వరకు తీసుకున్న అప్పులు చెల్లిస్తారు. పంట చేతికొచ్చినప్పుడే ఇదే బ్యాంకలో తమ ఉత్పత్తులకు అమ్మి, గత సీజన్లలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తారు. ఆర్బీఐ సహకార బ్యాంకుల లావాదేవీలను నిలిపి వేయడంతో రైతులు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అదే స్థాయిలో అప్పులు చెల్లించే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా రైతుల ఇళ్ళల్లో వ్యవసాయ ఉత్పత్తులు పేరుకుపోయినాయి. పెద్దనోట్ల రద్దుతోపాటు సొసైటీ బ్యాంకుల్లో లావాదేవీలను నిలిపివేయడం వల్ల ములుకనూరు బ్యాంకుకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది.
అనవసర భారం మోయాల్సి వస్తోంది: అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అధ్యక్షుడు, ముల్కనూర్ సహకార బ్యాంకు
పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల డబ్బు సంపన్న వర్గాలకంటే ఎక్కువగా రైతులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు తీసుకుని మెజారిటీ ప్రజలను రక్షించాల్సి ఉంటుంది. అలాంటి చర్యలు లేకపోవడంతో ప్రతిష్టాత్మకమైన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు ఏడు వేల మంది సభ్యులకు సకాలంలో సేవలు అందించలేకపోతోంది.












Click it and Unblock the Notifications