ఎంపీ కవితకు ఊరట: కూతురుకి చిక్కులు తప్పించిన కెసిఆర్!
హైదరాబాద్/నిజామాబాద్: తెలంగాణ ప్రజల నిర్ణయం, కోరిక మేరకే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చీప్ లిక్కర్ అంశాన్ని పక్కన పెట్టారని కెసిఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం అన్నారు.
ఆమె నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నిజామాబాద్ తాగునీటి అవసరాల కోసం 2 టిఎంసీల నీరు కేటాయించాలని తాను ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. సిఎం కెసిఆర్ ప్రజల మనిషి అని ఆమె కితాబిచ్చారు.
బంగారు తెలంగాణ అంటే ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. మన ముఖ్యమంత్రి ప్రజల మనిషి అని ఆమె ప్రశంసించారు.
కవితకు కెసిఆర్ ఊరట
తన కూతురు, ఎంపీ కవితకు ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద ఊరటనిచ్చారనే చెప్పవచ్చు. మద్యం పాలసీ పైన ఆయన వెనక్కి తగ్గారు. చీప్ లిక్కర్ పైన విపక్షాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. దీంతో, కెసిఆర్ దానిపై తగ్గారు.
ఇది కవితకూ ఊరట నిచ్చిందని చెప్పవచ్చు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టాలనుకుంటున్న చీప్ లిక్కర్ పైన స్పందించాలని కొద్ది రోజుల క్రితం విలేకరులు కవితను ప్రశ్నించారు.
ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన తర్వాత తాను చీప్ లిక్కర్ పైన మాట్లాడుతానని చెప్పారు. తమ సంస్థ జాగృతి గుడుంబా పైన పోరాటం చేస్తామని చెప్పారు. గుడుంబా వల్ల ఎక్కువ మంది మహిళలే నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గుడుంబాను నియంత్రించేందుకే చీప్ లిక్కర్ అన్నారు. ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకటించాక తాను స్పందిస్తానని కవిత నాడు చెప్పడం గమనార్హం. పాలసీ నచ్చకుంటే ఆమె ఏం చేస్తారు? అనే ప్రశ్న కూడా చాలామందిలో ఉదయించింది. అయితే, చీప్ లిక్కర్ పైన వెనక్కి తగ్గడం ద్వారా కవితకు కెసిఆర్ ఊరట నిచ్చారని చెప్పొచ్చు.