ఎత్తులు జిత్తులు చెల్లవ్.. ఇక గద్దె దించుడే.. కేసీఆర్పై విజయశాంతి ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ సర్కార్కు కాలం దగ్గరపడించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా రైతుబంధుతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందంతా వడ్ల కొనుగోలును రైతులు మర్చిపోయేందుకు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఊసరవెల్లి కేసీఆర్ డ్రామాలను ప్రజలు గ్రహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గద్దె దించడం ఖామని హెచ్చరించారు.
దొరను గద్దె దించుడు ఖాయం
రాష్ట్రంలో దొర పాలనకు గడియలు దగ్గరపడ్డాయని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరంతో సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ .. ఇప్పుడు రైతులను మోసగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాయ మాటలకు , డ్రామాలకు మోసపోయే స్థితిలో రాష్ట్ర రైతాంగం లేదన్నది గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో ఊసరవెల్లి కేసీఆర్ను జనం గద్దె దించుతారని హెచ్చరించారు.
రైతుబంధుతో రాజకీయ విన్యాసాలు
తెలంగాణలో రైతులు యాసంగి వరి సాగు చేయొద్దు.. కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించారని విజయశాంతి గుర్తు చేశారు. రైతులు వడ్ల ముచ్చటను మరచిపోతారని.. పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నట్లు తెరమీదకు తెచ్చారు. ఇందుకు ఊరూరా రైతుబంధు సంబురాలు చేయాలని పార్టీ నేతలు ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. డప్పుల దరువులతో రైతుబంధును జాకీలతోని లేపాలే అన్నట్టుగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. ఊరు వాడలో వారం రోజులుగా రైతుబంధుతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చారణ కోడికి బారాణ మసాల తీరుగా ప్రచారం
రైతు బంధే సర్వరోగనివారిణి కరోనా నిబంధనల్ని కాళ్ల వేసి తొక్కి మరీ చారణ కోడికి బారాణ మసాల తీరుగా ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాములమ్మ ఫైర్ అయ్యారు. కనీసం రైతు బంధు వారోత్సవాలు ఎందుకు జరుపుతున్నారో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కి చేయనందుకా.. అని ప్రశ్నించారు.
ఏడేండ్ల కేసీఆర్ పాలనలో వేలాది మంది రైతుల ఉసురు తీసుకున్నందుకా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా తెలంగాణలో అమలు చేయనందుకా.? దేనికి రైతు బంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో కనీసం అన్నదాతలకైనా తెలపాలని డిమాండ్ చేశారు. పంట రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే రైతులపై దాడులు చేయడం సిగ్గుచేటని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు