టీఆర్ఎస్ మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది: ఈసీకి బీజేపీ ఇంఛార్జ్ ఫిర్యాదు
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పై తాజాగా బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు.. బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మునుగోడులో ఓటమి తప్పదని అర్థమైన టీఆర్ఎస్ తమ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై అక్రమ ఆరోపణలు చేస్తోందని తరుణ్ ఛుగ్ ధ్వజమెత్తారు.
మరోవైపు, ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ఈసీని కలిశారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీని, పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని బద్నాం చేసే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించినట్లు ఆరోపించారు.
రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను కలిసి బీజేపీ నేతలు వివరణ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న ఖాతాలకు సుశీ ఇన్ ఫ్రా నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
కాగా, మునుగోడు ఉపఎన్నికలో మంగళవారంతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించారు. పలివెలలో ఈటల రాజేందర్ వాహనాలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో కొట్టుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.