రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ-అమిత్ షా వరస పర్యటనలు, సభలకు ప్రణాళికలు సిద్దం అయ్యాయి.
మరి కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనేది బీజేపీ వ్యూహం. దీంతో, స్వయంగా ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలు జరిగే వరకూ ప్రతీ నెలా ఇద్దరి పర్యటనలు ఉండేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.
బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా తెలంగాణలో వరస పర్యటనలు చేయనున్నారా. ప్రధాని మోదీ యూపీ తరహాలో తెలంగాణలోనూ త్రిముఖ వ్యూహం అమలుకు సిద్దం అవుతున్నారు. ఫిబ్రవరి 13న జరిగే సభతొ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని సమరశంఖం పూరించనున్నారు.

ముగ్గురు అగ్రనేతల వరుస సభలు..
అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవ్వటంలో భాగంగా తెలంగాణ బీజేపీ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇప్పటికే బూత్ స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు పార్టీ అధినాయకత్వం వరుస సమావేశాలు నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది.
ప్రతీ 15 రోజులకు తెలంగాణ కేంద్రంగా జరిగే సభలకు పార్టీ జాతీయా ధ్యక్షుడు నడ్డా.. ప్రధాని మోదీ.. అమిత్ హాజరయ్యేలా నిర్ణయించారు. పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులను, శక్తికేంద్రాల ఇన్చార్జులను క్రియాశీలం చేయడం, స్థానిక నాయకత్వాన్ని తయారుచేయటం వంటి బాధ్యతలను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు.
తెలంగాణకు బీజేపీ ఏం చేయలేదనే ప్రచారం తిప్పి కొట్టేందుకు పూర్తి లెక్కలతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకత్వం కేంద్ర మంత్రులకు సూచించింది. దీంతో, పార్లమెంట్ సమావేశాల తరువాత కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు కొనసాగనున్నాయి.

ప్రతీ నెలా ప్రధాని - షా పర్యటనలు
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కొంత కాలంగా పార్టీ జాతీయ నేతలు కసరత్తు చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి లోక్ సభ నియోజవర్గాల వరకు బాధ్యతలను కేటాయించారు. నాలుగు లోక్ సభ స్థానాలను కలిపి ఒక క్లస్టర్ గా నిర్ణయించారు. మొత్తం 17 లోక్ సభ స్థానాలను నాలుగు క్లస్టర్లుగా ఖరారు చేసారు.
పార్టీ ముఖ్య నేతలు జిల్లా స్థాయి సమావేశాలకు హాజరవుతారు. క్లస్టర్ మీటింగ్ లకు ప్రధాని మోదీ -అమిత్ షా హాజరయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నానరు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్ లను నిర్వహించలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న సన్నాహక సమావేశం ఏర్పాటు చేసారు.
ప్రధాని 13న హైదరాబాద్ పర్యటన సమయంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అదే సమయంలో తెలంగాణ పైన స్వయంగా ఫోకస్ పెట్టిన ప్రధాని ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారు.

కార్నర్ మీటింగ్ లకు సమాయత్తం..
ఇక..క్షేత్ర స్థాయి నుంచి బీఆర్ఎస్ పై పోరాటం కోసం కార్నర్ మీటింగ్ ల నిర్వహణకు పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల కార్నర్ మీటింగ్ ల నిర్వహణ కు కార్యాచరణ సిద్దం చేసారు. ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు వీటిని నిర్వహించనున్నారు. ప్రారంభ సమావేశాలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జులతోపాటు జాతీయ పార్టీ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యులు, సీనియర్ నాయకులు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు హాజరవుతారు.
రెండోదశలో మండలం యూనిట్గా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక, మూడోదశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు. దీంతో..పాటుగా కేంద్ర మంత్రులు.. పార్టీలో జాతీయ స్థాయి సీనియర్లకు తెలంగాణలో నిరంతరం పర్యటనలు చేస్తూ సభలు..పార్టీ సమావేశాల్లో పాల్గొనేలా మార్చి నుంచి బీజేపీ కొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది.












Click it and Unblock the Notifications